దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌

ఏ ప్ర‌యోజ‌నం లేనిదే రాజ‌కీయ నాయ‌కులు ఏం చేయ‌ర‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌గ్గ‌ర నుంచి అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం వ‌ర‌కూ ప్ర‌తి సంద‌ర్భంలోనూ త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే నాయ‌కులు వ్యూహాలు ర‌చిస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ ప‌ర్య‌ట‌న వెన‌క కూడా ఇలాంటి ప్ర‌ణాళికే దాగి ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అక్క‌డ గెలుపు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్‌ను ఇర‌కాటంలో పెట్టే దిశ‌గా బీజేపీపై వ్య‌తిరేకిత తెప్పించ‌డ‌మే కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ అక్క‌డ విజ‌యం కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే మొద‌ట‌గా అమ‌లు చేయ‌డంతో పాటు అక్క‌డ స్థానిక నాయ‌కుల‌కు కీల‌క ప‌ద‌వులు అప్ప‌జెప్ప‌డం అభివృద్ధి ప‌నుల‌ను ప‌రుగులెత్తించ‌డం ఇలా అన్ని ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈట‌ల‌కే అక్క‌డి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ రావ‌డంతో క‌రోనా సాకుతో ఉప ఎన్నిక వాయిదా ప‌డేలా చేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీని ఇర‌కాటంలో పెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చార‌ని చెప్తున్నారు. ఏడాదికిపైగా ఢిల్లీ ముఖం చూడ‌ని కేసీఆర్ ఇప్పుడు దేశ రాజ‌ధానిలో టీఆర్ఎస్ పార్టీ భ‌వ‌నం భూమి పూజ కోసం వెళ్లి అక్క‌డే మ‌కాం వేశారు. ప్ర‌ధాని మోడీతో స‌హా హోంశాఖ మంత్రి అమిత్ షా ఇత‌ర కేంద్ర‌మంత్రుల‌ను ఆయ‌న క‌లిశారు.

అయితే ఇలా బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం వెన‌క ఇక్క‌డ హుజూరాబాద్‌లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌నున్న ఈట‌లను టార్గెట్ చేయాల‌నే ప్లాన్ దాగి ఉంద‌ని నిపుణులు అనుకుంటున్నారు. పెండింగ్ స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ముందు పెట్టారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వానికి అధికారిక భ‌వ‌నం కావాల‌నే డిమాండ్ లేవ‌నెత్తారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తిన జ‌ల‌వివాదాల‌కు కేంద్ర‌మే ప‌రిష్కారం చూపాల‌నే కోణంలో ట్రిబ్యున‌ల్‌ను డిమాండ్ చేశారు. ఇలా వివిధ స‌మస్య‌ల‌నే ఏక‌ర‌వు పెట్టారు. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు హామీ ఇచ్చిన అనేక అంశాలు కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిన మ‌రోసారి ప్ర‌స్తావించిన కేసీఆర్ బీజేపీని ఇర‌కాటంలో పెట్టేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కేంద్రం వ‌ద్ద కేసీఆర్ ప్ర‌స్తావించిన ఈ అంశాల‌న్నీ ఉప ఎన్నికల్లో బీజేపీపై ప్ర‌యోగించేందుకు టీఆర్ఎస్‌కు విమ‌ర్శ‌నాస్త్రాలు కాబోతున్నాయ‌ని టాక్‌. తాము ప్ర‌ధానిని క‌లిసి ప‌దే ప‌దే విన్నివించుకున్న‌ప్ప‌టికీ రాష్ట్రానికి న్యాయం చేయ‌డం లేద‌నే ఆరోప‌ణ‌ల‌ను టీఆర్ఎస్ ప్ర‌జ‌ల ముందు ఉంచ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కేసీఆర్ బ‌తిమాలుకుంటేనే ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు కూడా టీఆర్ఎస్‌కే రాజ‌కీయ ఆయుధంగా మారే వీలుంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏమైనా చేస్తాన‌ని గ‌తంలో కేసీఆర్ చాలా సార్లు ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కోసం తాము ప్ర‌ధానిని బ‌తిమాలుకున్నా ప‌ని కావ‌డం లేద‌ని మోడీని క‌లిసినా రాష్ట్ర ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ల‌భించ‌లేద‌ని టీఆర్ఎస్ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.