కొడుకు కేంద్రమంత్రి.. పేరెంట్స్ కూలీలు..

అవును.. మీరు చదివింది అక్షరాల నిజం. కొడుకు కేంద్రమంత్రిగా మోడీ సర్కారులో పని చేస్తుంటే.. ఆయన తల్లిదండ్రులు నేటికీ వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న అరుదైన రాజకీయ నాయకుడిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు మోడీ సర్కారులోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్. ఇలాంటి ఉదంతం మన తెలుగు నేల మీద భూతద్దం వేసినా సైతం గుర్తించలేం. రాజకీయ నేతలు ఎలా ఉండాలి? ఎలాంటి నేతలతో ఈ దేశం తలరాతలు మారతాయన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మారారు కేంద్రమంత్రి మురుగన్. ఇప్పుడు ఆయన రియల్ స్టోరీ.. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.

ఇటీవల కేంద్ర కాబినెట్ ను విస్తరిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా సిట్టింగ్ మంత్రుల్ని పక్కన పెట్టేసి.. పలువురు కొత్త నేతలతో తన ప్రభుత్వానికి కొత్త హుషారు తెచ్చే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు విలక్షణ నేతల్ని తన మంత్రివర్గంలో తీసుకున్నారు. సాధారణంగా కేంద్ర మంత్రులన్నంతనే వారి స్థాయి ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకు భిన్నంగా సాదాసీదాగా.. సామాన్యమైన బతుకులు బతికే వారిని.. ఆదర్శాలకు బలంగా కట్టుబడి ఉండే వారిని తన జట్టులోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. వారి స్ఫూర్తివంతమైన జీవితాలు ఇప్పుడు వార్తా కథనాలుగా మారాయి.

కేంద్రమంత్రి మురుగన్ తల్లిదండ్రుల్ని చూస్తే.. వారిది తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని పరమత్తి సమీపంలోని కోనూరు గ్రామం. ఆయన తండ్రి లోకనాథన్ కు 65 ఏళ్లు కాగా.. తల్లి వరదమ్మాల్ కు 60 ఏళ్లు. ఈ భార్యభర్తలు ఇద్దరు మొదట్నించి వ్యవసాయ కూలీలే. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు మురుగన్ కాగా.. రెండోవారు రామస్వామి. తమ రెక్కల కష్టంలో ఇద్దరు కొడుకుల్ని వారు కష్టపడి చదివించారు. వారి కష్టం ఊరికే పోలేదు. మురుగన్ కుచిన్నప్పటి నుంచే చదువు మీద విపరీతమైన ఆసక్తి ఉండేది.

అదే ఆయన్ను లాతో పాటు ఎంఎల్.. పీహెచ్ డీ పూర్తి చేసిన తర్వాత బీజేపీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. తాజాగా కేంద్ర మంత్రిస్థాయికి ఎదిగారు. కొడుకు కేంద్రమంత్రి అయినప్పటికీ.. ఆయన తల్లిదండ్రులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమకు తెలిసిన కూలీ పనులు చేసుకుంటూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొడుకు అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ.. ఎందుకింతలా కష్టపడుతున్నారని మురగన్ తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తే.. వారిచ్చే సమాధానం వింటే మురుగన్ కంటే.. వారి మీదనే గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. తన కొడుకు.. కోడలు తమ వద్దకు రావాలని కోరారని.. కానీ తమకు ఇష్టం లేదని వారు చెబుతున్నారు. తమ సొంత కష్టం మీదనే బతకటమే తమకు ఇష్టమని.. అందుకే కొడుకు దగ్గకు వెళ్లలేదని చెబుతున్నారు. ఇక.. మురుగన్ సతీమణి చెన్నైలో పిల్లల డాక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో మురుగన్ లాంటి నేతలు.. ఆయన తల్లిదండ్రులు లాంటి వారు చాలా.. చాలా తక్కువగా కనిపిస్తారని చెప్పక తప్పదు.