ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా ? అసలు పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎంత ఉంటుంది ? అంటే అంతంతమాత్రమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నా మానాన నేను ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే అనవసరంగా ముద్రగడ మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

2019 ఎన్నికలలో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఆయన తరపున ఆయన అన్న నాగబాబు, మెగా కుటుంబ సభ్యులు, పలువురు నటులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక వీరందరికీ తోడుగా ఈ నెల 5 న స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, అలా కాని పక్షంలో తన పేరు మార్చుకుంటానని’’ సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలతో జనసేన వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ప్రచారంలో ముందున్న జనసేన ముద్రగడ వ్యాఖ్యలతో ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలన్న కసిని పెంచిందని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును సైతం పక్కనపెట్టి వైసీపీ ఈ ఎన్నికలలో వంగా గీతను రంగంలోకి దింపింది. ఇరు వర్గాల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాపు వర్గానికి చెందిన ముద్రగడ వైసీపీలో చేరడంతోనే తన ప్రాధాన్యతను కోల్పోయాడని, ఆయన వల్ల వైసీపీకి లాభం కలిగేది అనుమానమే అని అంటున్నారు.