యువ తొలి ఓటు ఎటో?

Andhra Pradesh

సార్వ‌త్రిక ఎన్నిక‌ల కార‌ణంగా దేశ‌మంతటా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లూ ఉండ‌టంతో ఆ హీట్ మ‌రింత ఎక్కువైంది. ఇక్క‌డ కుర్చీ కాపాడుకోవ‌డం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమైనా చేసేందుకూ వెనుకాడ‌టం లేదు.  మ‌రోవైపు ఏపీ భ‌విష్య‌త్ కోసం కూట‌మిగా ఏర్ప‌డిన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ గెలుపు ధీమాతో సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు అధికారంలోకి రావాలో నిర్ణ‌యించ‌డంలో యువత ఓట్లు కీల‌కంగా మారే అవ‌కాశ‌ముంది. ముఖ్యంగా కొత్త‌గా ఓటు పొందిన వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపుతార‌న్న‌ది కీల‌కంగా మారింది.

జ‌న‌వ‌రిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన తుది జాబితా ప్ర‌కారం ఏపీలో 4 కోట్ల 8 ల‌క్ష‌ల ఓట‌ర్లున్నారు. ఓట‌ర్ల జాబితాను ప్ర‌త్యేకంగా స‌వ‌రించిన త‌ర్వాత కొత్త‌గా 22 లక్ష‌ల మంది ఓట‌ర్ల జాబితాలో చేరారు. వీళ్ల‌లో 18, 19 ఏళ్ల ఓట‌ర్లు ఏకంగా 8 ల‌క్ష‌ల మంది ఉన్నారు. కొత్త‌గా ఓటు హ‌క్కు పొందిన ఈ యువ‌కులు తొలిసారి ఓటు వేయాల‌నే ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ తొలి ఓటు ఎటు ప‌డుతుంద‌న్న‌దే ఆసక్తిక‌రంగా మారింది.

పిఠాపురంలో  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే త‌మ తొలి ఓటు వేస్తామ‌ని అక్క‌డి యువ‌త చెబుతోంద‌ని తెలిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జ‌న‌సేన పోటీ చేసే స్థానాల్లో యువ‌త ఆ పార్టీకే జై కొట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక మిగతా చోట్ల మాత్రం టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తునిచ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కూట‌మితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని యువ‌త న‌మ్ముతున్నార‌ని టాక్‌. ఇది కూట‌మికి క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంది. యువ‌త కూట‌మికి అండ‌గా నిలిస్తే అప్పుడు జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో?