ఎన్నికల కోసం కొత్త ప్లాన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాన్ని వర్కవుట్ చేయబోతున్నారు. అంటే ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినా ఎందుకనో లాంచ్ చేయలేదు. అందుకనే తొందరలోనే తన సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సరికొత్త ప్లాన్ ఏమిటంటే సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కుప్పంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువకుడిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

పార్టీలోకి యువత ఎక్కువగా రావాలని కోరుకుంటున్న చంద్రబాబు సేవామిత్ర రూపంలో యువతకు బాగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ వాలంటీర్లే పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాలను జనాలకు అందచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించింది. రేపటి ఎన్నికల్లో వైసీపీకి వాలంటీర్లే కీలకంగా వ్యవహరించబోతున్నారని చంద్రబాబు అనుమానం.

అందుకనే దానికి విరుగుడుగా టీడీపీ తరపున కూడా సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేసి యువత ద్వారా రాజకీయం చేయాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ ఏడాదిలోగా సేవామిత్రలను నియమించి పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన హయాంలో జనాలకు జరిగిన మేళ్ళు, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సేవామిత్రలు వివరిస్తారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాని, అన్యాయాలు జరుగుతున్నాయని జనాలకు వివరిస్తారట.

అంటే ప్రభుత్వం+ వైసీపీకి  వ్యతిరేకంగాను, టీడీపీకి అనుకూలంగాను ఈ సేవామిత్రలు పనిచేయాలన్నమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవామిత్రలు పనిచేస్తుంటే వాలంటీర్లు లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా అధికారపార్టీ నేతలు చూస్తు ఊరుకుంటారా ? అప్పుడేమన్నా గొడవలు జరిగితే దానికి బాధ్యత ఎవరిది అనే విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పలేదు. ఏదేమైనా పార్టీకి మద్దతుగా పనిచేసేందుకు ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని మాత్రమే చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరీ కొత్త వ్యవస్ధ వల్ల పార్టీకి ఎంత ఉపయోగమో చూడాల్సిందే.