ప్రశాంత్ నీల్ కు అంత టైం ఎక్కడిది

కొన్ని కాంబోలు కోరుకుంటాం కానీ అంత సులభంగా తెరకెక్కవు. టైం పడుతుంది లేదా కలగానే మిగిలిపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ని హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత కార్యదర్శి కలిశాడు . అంతే ఈ కాంబోలో సినిమా వస్తుందని, త్వరలోనే ఈ కలయికలో ప్యాన్ ఇండియా మూవీ చూడొచ్చని ఏవేవో అల్లేశారు. వాస్తవానికి జరిగింది వేరు. పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేకపోయినా ఈ మీట్ జరిగిన ఉద్దేశంలో ఎలాంటి ప్రత్యేకత లేదు.  రౌడీ హీరోతో నీల్ కు పరిచయం ఉంది కానీ ఏదైనా ప్రాజెక్టు చేయాలనే తలంపు కానీ ఆలోచన  కానీ ఇప్పటికిప్పుడు లేవు.

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది ఎందుకు అసాధ్యమో అర్థమవుతుంది. ముందు సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మొదలుపెట్టాలి. ఎంతలేదన్నా ఏడాదికి పైగానే షూటింగ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు ఇంకో ఆరు నెలలు వేసుకోవచ్చు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ  మేకర్స్ తలపెట్టిన ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ ని పూర్తి చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకోవాలి. దాని షూట్ వచ్చే ఏడాది ప్రారంభించే తీరాలి. సో ప్రశాంత్ నీల్ ఫ్రీ అవ్వాలంటే ఎంతలేదన్నా 2026 దాటిపోతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది.

ఇంత క్లిష్టమైన షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ఇతర హీరోల గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. పైగా విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమో కానీ వరస ఫ్లాపులతో ఇమేజ్ మాత్రం ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ చిత్రం చేస్తున్న రౌడీ హీరో కొంత కాలం పాటు దాని మీదే పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు.  భారీ ఆశలు పెట్టుకున్న ఖుషి పూర్తి స్థాయి ఫలితం అందుకోకపోవడంతో పాటు ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ దెబ్బకు అలెర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉంటున్నాడట. నీల్ సంగతేమో కానీ కొన్నేళ్ల క్రితం సుకుమార్ తో లాక్ చేసుకున్న సినిమా చేజారడం బ్యాడ్ లక్కే.