శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు ఖర్చు పెడతారు. రాహుల్ సంకృత్యాన్ ఈ బాపతే. న్యాచురల్ స్టార్ నానితో 2021 శ్యామ్ సింగ రాయ్ చేశాక మళ్ళీ ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. అది మంచి విజయంతో పాటు అవార్డులు తీసుకొచ్చినా సరే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరో కోసం ప్రయత్నించాడనే టాక్ వచ్చింది కానీ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసు లేకుండా పోయింది. ఫైనల్ గా తన కాంబోని సెట్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్.

విజయ్ దేవరకొండతో ఒక ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కలయిక టాక్సీవాలా వచ్చింది. రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో పైరసీ వెర్షన్ లీకైనప్పటికీ మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా గీత గోవిందం స్థాయి కాకపోయినా దీనికైన బడ్జెట్ కు తగ్గట్టుగా లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాహుల్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రౌడీ బాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో మైత్రి నిర్మాణంలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత మూడోసారి చేతులు కలుపుతున్నారు.

ప్రస్తుతం రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఒక ఆరు నెలలు దీని మీద సీరియస్ గా వర్క్ జరుగుతుంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించే మరో సినిమా వచ్చే వారం లాంఛనంగా ప్రకటించబోతున్నారు. రౌడీ జనార్దన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇవి అయ్యాకే రాహుల్ సంకృత్యాన్ మూవీ పట్టాలు ఎక్కొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశ పరచడంతో విజయ్ దేవరకొండ కొత్త స్క్రిప్ట్ ల మీద మరింత శ్రద్ధ పెడుతున్నాడు. మార్కెట్ మళ్ళీ బలపడాలంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం. అది ఎవరు ఇస్తారో చూడాలి.