టిల్లు స్క్వేర్ తర్వాత ఇంకో ‘స్క్వేర్’

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ బేన‌ర్ల‌లో ఒక‌టైన సితార ఎంట‌ర్టైన్మెంట్స్‌కు పెద్ద బ‌డ్జెట్ సినిమాల కంటే చిన్నవే బాగా క‌లిసొస్తున్నాయి. గ‌త ఏడాది 2022లో డీజే టిల్లు మూవీతో ఘ‌న‌విజ‌యాన్నందుకున్న ఆ సంస్థ‌కు గ‌త ఏడాది మ్యాడ్ మూవీ మంచి లాభాలు అందించింది. ఇటీవ‌లే డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్‌తో ఇంకో పెద్ద స‌క్సెస్‌ను ఖాతాలో వేసుకుంది సితార సంస్థ‌.

బ‌హుశా ఆ సంస్థ చ‌రిత్ర‌లోనే ఈ సినిమా అందించినంత లాభాలు ఇంకే సినిమా ఇచ్చి ఉండ‌కపోతే ఆశ్చ‌ర్యం లేదు. టిల్లు స్క్వేర్ త‌ర్వాత మ్యాడ్ మూవీకి కూడా సితార బేన‌ర్లో సీక్వెల్ తెర‌కెక్కుతుండ‌డం విశేషం. టైటిల్ విష‌యంలోనూ టిల్లు స్క్వేర్‌నే అనుస‌రిస్తూ.. మ్యాడ్ స్క్వేర్ అని పెట్టుకున్నారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా చ‌డీచ‌ప్పుడు లేకుండా ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఇప్పుడీ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు.

టిల్లు స్క్వేర్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ స‌మ‌క్షంలో మ్యాడ్ స్క్వేర్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. మ్యాడ్ మూవీలో న‌టించిన ముగ్గురు హీరోలు సంగీత్ శోభ‌న్‌, నార్నె నితిన్, రామ్ నితిన్‌ల‌తో పాటు విష్ణు ఓయ్ ఈ చిత్రంలోనూ అవే పాత్ర‌ల్లో కొన‌సాగ‌బోతున్నారు. వీళ్లు సినిమా ప్రారంభోత్స‌వంలోనూ పాల్గొన్నారు. మ‌రి హీరోయిన్ల మాటేంటో చూడాలి. మ్యాడ్‌ను మించిన వినోదం ఈ చిత్రంలో ఉంటుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.

మ్యాడ్ మూవీలో హీరోలు ముగ్గురూ ఇంజినీరింగ్ పూర్తి చేయ‌డంతోక‌థ ముగుస్తుంది. అలాంట‌పుడు మ్యాడ్ స్క్వేర్‌లో క‌థ కాలేజీ నుంచి హీరోల ఉద్యోగ జీవితం వైపు మ‌ళ్లే అవ‌కాశ‌ముంది. ప్రాప‌ర్ సీక్వెల్ లాగా తీయాలంటే అలాగే క‌థ‌ను ముందుకు తీసుకెళ్లాలి. అలా కాకుండా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ ఇంకేదైనా డిఫ‌రెంటుగా ట్రై చేస్తాడేమో చూడాలి