ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు ఒక దశలో పూర్తిగా మరిచిపోయారు. ఆ సినిమా షూట్ మధ్యలో ఆగిపోయి, ఎంతకీ పున:ప్రారంభం కాకపోవడం.. పవన్ ఫోకస్ వేరే సినిమాలు, రాజకీయాల మీదికి మళ్లడంతో ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది.

కానీ భారీగా ఖర్చు పెట్టి చాలా వరకు సినిమాను పూర్తి చేశాక దీన్ని ఏ నిర్మాత అయినా ఎందుకు పక్కన పెడతాడు? కాకపోతే పవన్ మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చి ఈ సినిమాను పూర్తి చేస్తాడో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. ఇలాంటి టైంలో ‘ధర్మం కోసం యుద్ధం’ పేరుతో ‘హరిహర వీరమల్లు’ కొత్త టీజర్ ఒకటి వదిలింది టీం. అది ఇంట్రెస్టింగ్‌గా, భారీ స్థాయిలో ఉండడంతో అభిమానుల్లో మళ్లీ ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది.

కానీ టీజర్ చివర్లో ఇచ్చిన ట్విస్టే అభిమానులకు మింగుడుపడని విధంగా ఉంది. ఈ సినిమా దర్శకుడిగా క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ పేరు కూడా వేయడం పెద్ద ట్విస్టే. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకుని అనుష్క సినిమాను లైన్లో పెట్టినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ పవన్ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి క్రిష్ బ్రేక్ తీసుకున్నాడు తప్ప.. ఈ ప్రాజెక్టును వదిలిపెట్టలేదన్న వాదన వినిపించింది. కానీ ఇప్పుడు చూస్తే క్రిష్ తప్పుకుని.. మిగతా పని పూర్తి చేసే బాధ్యత నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడైన జ్యోతికృష్ణకు అప్పగించాడని అర్థమైంది. కానీ జ్యోతికృష్ణ ఫిల్మోగ్రఫీ చూసిన పవన్ ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పలేదు. నీ మనసు నాకు తెలుసు, కేడీ, ఆక్సిజన్, రూల్స్ రంజన్.. ఇలా జ్యోతికృష్ణ తీసిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి.

ముఖ్యంగా అతడి చివరి సినిమా ‘రూల్స్ రంజన్’ చూస్తే దర్శకుడిగా అతను ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నాడో అర్థమవుతుంది. ఇలాంటి దర్శకుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌తో ‘హరి హర వీరమల్లు’ లాంటి మెగా మూవీని డీల్ చేయడం అన్నది పవర్ స్టార్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. సినిమాకు సంబంధించి మేజర్ వర్క్ క్రిష్‌‌యే పూర్తి చేసి ఉండొచ్చు. అయినా సరే.. ఈ సినిమా జ్యోతికృష్ణ ప్రస్తుతం చేతుల్లోకి వెళ్లిందనే విషయం పవన్ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది.