ఈ స‌మ‌యంలో ఇలాంటివి అవ‌సర‌మా ప‌వ‌న్ స‌ర్‌!

ఇది కీల‌క ఎన్నికల స‌మ‌యం. ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను ఒడిసి ప‌ట్టుకుని.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకు నేందుకు పార్టీల‌కు ఇది చ‌క్క‌ని అవ‌కాశం.దీనికంటే ముందు పార్టీల్లో నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ఆయా పార్టీల అధినేతలు మ‌రింత సంయ‌మ‌నంగా ఉండాల్సిన త‌రుణం. ఈ విష‌యంలో ఏ చిన్న పొర పాటు జ‌రిగినా.. ఓటు రాలిపోతుంది.. ప‌క్క‌దారి ప‌డుతుంది.. ఫ‌లితంగా ఏ ఓటును అయితే చీల్చ‌కూడ‌ద‌ని ఇన్నాళ్లుగా త‌ప‌న ప‌డుతూ వ‌చ్చారో.. పోరాటాలు చేశారో.. అవ‌న్నీ వృథా కావ‌డం ఖాయం.

ఇప్పుడు ఇదే మాట జ‌న‌సేన విష‌యంలో స్ప‌ష్టంగా వినిపిస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ తో, బీజేపీతో చేతులు క‌ల‌ప‌డానికి తాను చెబుతున్న‌ట్టు ఏకైక కార‌ణం వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా.. సీఎం జ‌గ‌న్‌ను ప‌ద‌వీచ్చుతుడను చేయ‌డ‌మే. దీని కోస‌మే ఆయ‌న అసాధ్య‌మైన పొత్తు ను సాధ్యం చేశాన‌ని కూడా చెప్పుకొచ్చారు. అనేక మందితో తిట్లు కూడా తిన్నాన‌న్నారు. మ‌రి ఇంత చేసి.. ఇంత క‌ష్ట‌ప‌డి చివ‌ర‌కు.. ఏం చేస్తున్నారు?  పార్టీ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో స‌క్సెస్ అవుతున్నా రా? అంటే.. లేద‌నే చెప్పాలి.

ఇప్పుడు జ‌న‌సేన గురించి ఏ ఇద్ద‌రు మాట్లాడుకున్నా.. పెదవి విరుపులు క‌నిపిస్తున్నాయి.. ఇదొక పార్టీనా?  అంటూ.. వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. `నేను స‌ల‌హ‌లు విన‌ను. ఎవ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌ద్దని“ గ‌తంలోనే చెప్ప‌డం ఒక కార‌ణం. దీంతో ఒక‌రిద్ద‌రు కాదు.. ఈ వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత‌.. 10 మంది కీల‌క నేత‌లు పార్టీకి గుడ్ బై చెప్పారు. క‌ట్ చేస్తే.. మ‌రో నెల రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న స‌మ యంలో ప‌వ‌నే ఫైన‌ల్‌.. మీరెవ‌రూ నోరెత్తద్దంటూ.. పార్టీ నాయ‌కుడు నాగ‌బాబుతో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయించారు.

ఈ ధోర‌ణి ఇప్పుడు జ‌న‌సేనను మ‌రింత కుంగ‌దీస్తోంది. త‌మ‌కు టికెట్ ఇస్తామ‌నిచెప్పి గొంతు కోశారంటూ .. నాలుగు రోజులుగా కాకినాడ నుంచి తిరుపతి వ‌ర‌కు నాయ‌కులు చెబుతున్నారు. కాకినాడ మాజీ మేయ‌ర్ పంతం సుజాత నిప్పులు చెరిగారు. త‌ణుకులోనూ ఇదే ప‌రిస్థితి. ఇక‌, పాత గ‌న్న‌వ‌రంలో అభ్య‌ర్థులు లేన‌ట్టుగా.. తెలంగాణ నుంచి దిగుమ‌తి చేసుకున్న బీజేపీ నేత‌కు టికెట్ ఇచ్చారు. తిరుప‌తిలో వైసీపీ నుంచి తెచ్చుకున్న ఆర‌ణికి అవ‌కాశం ఇచ్చారు.

కానీ, ఏడాది కిందట ఇదే ఆర‌ణి తిరుగుబోత‌ని వ్యాఖ్యానించింది ప‌వ‌నే. ఇలాంటి త‌ప్పులు జేబులో పెట్టుకుని ఎవ‌రూ మాట్లాడొద్దంటే.. ఎలా?  ఇది ప్ర‌జాస్వామ్యం. పార్టీల్లోనూ ప్ర‌జాస్వామ్యం ఉంటుంది. ఇది లేన‌ప్పుడు.. పార్టీ ఉంటుంది.. అధినేత మీరు మాత్ర‌మే మిగులుతారు! అన‌డంలో సందేహం లేదు. న‌చ్చ‌జెప్పుకోవ‌డం.. బుజ్జ‌గించుకోవ‌డం ఏమాత్రం త‌ప్పుకాదు. ఇది లేన్నాడే పార్టీలు విచ్ఛిన్నం అయిపోతాయి. పోనీ.. మ‌న‌కు బ‌ల‌మైన కేడ‌ర్ ఉందా?  బూత్ లెవిల్లో ఒక్క క‌నుసైగ‌తో క‌ద‌లి వ‌చ్చే సైన్యం ఉందా?  అంటే లేదు.

నాయ‌కులు లేని పార్టీ కేడ‌ర్ లేని నాయ‌కుడు.. రాజ‌కీయాల‌ను న‌డిపించిన‌ట్టు చ‌రిత్ర ఎక్క‌డా చెప్ప‌డం లేదు. సో.. కీల‌క స‌మ‌యంలో కొన్ని విష‌యాల‌ను స‌హించినప్పుడే నాయ‌కుడిగా నిల‌బ‌డ‌తారు. ఇది చంద్ర‌బాబు విష‌యంలో నిజం అవుతోంది. మ‌రి ఆ 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీని చూసైనా ప‌వ‌న్ నేర్చుకోవాలి క‌దా!!