హత్యల్లో ఇరికించే ప్రమాద’వదనం’

రెగ్యులర్ కాన్సెప్ట్స్ జోలికి వెళ్లకుండా విభిన్నంగా ట్రై చేసే హీరోగా సుహాస్ కి మంచి గుర్తింపు ఉంది. ఒక్కో హిట్ తో మెల్లగా మార్కెట్ పెంచుకుంటూ నిలదొక్కుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సక్సెస్ తర్వాత శ్రీరంగనీతులు నిరాశ పరిచినా తక్కువ గ్యాప్ లో వెంటనే ప్రసన్నవదనంతో వస్తున్నాడు. మైత్రి లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ దొరకడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్ దక్కించుకోబోతున్న ఈ డిఫరెంట్ థ్రిలర్ మే 3 విడుదల కానుంది. ఇవాళ రిలీజ్ చేసిన టీజర్ ద్వారా కథలో కీలక అంశాలను రివీల్ చేశారు.

సూర్య (సుహాస్) కు ఫేస్ బ్లైండ్ నెస్ జబ్బు ఉంటుంది. అంటే మనుషుల మొహాలను గుర్తించలేడు. ఏవో కొండగుర్తులు పెట్టుకుని జీవితాన్ని లాగిస్తుంటాడు. ఈ క్రమంలో పొరపాట్లు కూడా జరుగుతాయి. ఆద్య అనే అమ్మాయితో పరిచయం ప్రేమగా దాకా వెళ్తుంది. ఓ రాత్రి హత్యను ప్రత్యక్షంగా చూసిన సూర్య హంతకులని పట్టుకునే క్రమంలో పోలీసులకు సహాయపడేందుకు సిద్ధపడతాడు. కానీ ఇతని వ్యాధే అడ్డంకిగా మారుతుంది. రివర్స్ లో తనే మూడు మర్డర్లలో ఇరుక్కుంటాడు. ఆధారాలు దొరక్కుండా ఇవి చేస్తున్నదెవరో పసిగట్టేందుకు సూర్య ఏం చేశాడనేది ప్రసన్నవదనం.

ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు అర్జున్ వైకె ఈ సినిమాని రూపొందించినట్టు కనిపిస్తోంది. సుహాస్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో డిఫరెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్లు పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ లతో పాటు సత్య, నందు, నితిన్ ప్రసన్న, హర్ష చెముడు, సాయి శ్వేత తదితరులు ఇతర తారాగణం. విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి డెప్త్ ని తీసుకొచ్చింది. టెక్నికల్ గా మంచి అవుట్ ఫుట్ తీసుకురావడంలో అర్జున్ పనితనం చూపించాడు. ఒకవేళ పూర్తి కంటెంట్ ఇదే స్థాయిలో ఉంటే మాత్రం సుహాస్ ఖాతాలో మే 3న మరో మంచి హిట్ పడిపోతుంది.