ఆప్ గెలిస్తే మూడంశాలే కీలకమవుతాయా ?

ఆదివారం జరగబోయే పోలింగ్ లో తమ గెలుపు తథ్యమని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అటు కాంగ్రెస్ చాలా ధీమాగా ఉన్నాయి. ఒకేదశలో 117 సీట్లకు  జరగబోయే పోలింగ్ లో రెండుపార్టీలు కూడా తమకు ప్లస్సులుగా ఉన్న అంశాలను బాగా హైలైట్ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీయే కాబట్టి జనాల్లోకి బాగా చొచ్చుకుపోతోంది. ఇదే సమయంలో ఆప్ కూడా జనాధరణ తమకు బ్రహ్మాండంగా ఉందంటు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది.

సరే కాంగ్రెస్ ను పక్కన పెట్టేస్తే ఆప్ ప్రధానంగా మూడు అంశాల మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అవేమిటంటే మొదటిదేమో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కున్న క్లీన్ ఇమేజి. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. మొదట్లో కాస్త దూకుడు మనిషి అనే ముద్రుండేది. అయితే గడచిన ఐదేళ్ళుగా బాగా ఆరితేరిపోయినట్లున్నారు. అందుకనే ప్రశాంతంగా తన దృష్టి మొత్తాన్ని పరిపాలనపైనే పెట్టారు.

ఇక రెండో అంశం ఏమిటంటే అందరికీ ఉచిత విద్యా పథకం. ఢిల్లీలోని అన్నీ స్కూళ్ళు, కాలేజీల్లో అర్హులందరికీ ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. విద్యాసంస్ధలకు పక్కా భవనాలు, నిరంతరం విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, టీచర్ల నియామకంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్ధ కూడా బాగా బలోపేతమైంది. అంతకుముందు ప్రభుత్వాలు విద్యారంగంపై ఇంతగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. అందుకనే ఢిల్లీ విద్యా వ్యవస్ధ భేష్ అనిపించుకుంటోంది.

ఇక మూడో పాయింట్ ఏమిటంటే అందరికీ ఉచిత వైద్యం. ఢిల్లీలోని వాడ వాడలా, మధ్య తరగతి, పేదలుండే కాలనీల్లో, మురికివాడల్లో కూడా చౌమల్లా క్లినిక్సని కేజ్రీవాల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో అవసరమైన డాక్టర్లు, ఇతర స్టాఫ్ ను నియమించారు. అత్యాధునికమైన టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులో ఉంచింది. దాదాపు 25 రకాల పరీక్షలను ఉచితంగా చేయటమే కాక మందులు కూడా ఉచితంగానే ఇస్తోంది. చౌమల్లా క్లినిక్కులు బాగా ప్రజాధరణ పొందాయి.

ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధుల విషయంలో ఈ క్లినిక్కులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవసరమైతే ఇళ్ళకే వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నాయి. అందుకనే దీనికి ఇంత ఆదరణ పెరిగిపోయింది. అందుకనే వీటిని మోడల్ గా చూపించి పంజాబ్ లో కూడా ఒక్క అవకాశం ఇవ్వమని ఓటర్లను కేజ్రీవాల్ అడుగుతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.