కరోనా దెబ్బకు దీదీ దిగొచ్చేసినట్టేగా

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో నిన్నటిదాకా ఎడ్డెం అంటే తెడ్డెంలా సాగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పవ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఇప్పుడు మోదీ బాటలో నడిచేందుకు సిద్దపడినట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి.

ఎందుకంటే… నిన్నటిదాకా లాక్ డౌన్ అంటే… అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించని దీదీ… ఇప్పుడు ఏకంగా మే నెలాఖరు దాకా బెంగాల్ లో లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పడమే కాకుండా… మోదీ సర్కారు చెప్పిన మేరకు పొడిగించే లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వనున్నట్లుగా బుధవారం సంచలన ప్రకటన చేశారు. దీదీలో వచ్చిన ఈ మార్పు కరోనా ప్రభావమేనన్న వాదనలు ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

దేశంలో కరోనా విస్తృతి మొదలైన సమయంలో మోదీ సర్కారు ప్రకటించిన లాక్ డౌన్ ను బెంగాల్ లో అమలు చేసే ప్రసక్తే లేదన్నట్లుగా దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తమ రాష్ట్రంలో కరోనా లేదన్నట్లుగానే ఆమె మాట్లాడారు.

చివరకు బెంగాల్ లో కరోనా పర్యవేక్షణకు మోదీ సర్కారు కేంద్ర బృందాన్ని పంపితే… ఆ బృందం పర్యటనకు కూడా దీదీ అంతగా సహకరించలేదన్న వార్తలూ వినిపించాయి. మొత్తంగా చూస్తే… ఆది నుంచీ మోదీ ఏది చేద్దామన్నా… దానిని మేం చేయమన్నట్లుగానే దీదీ సాగింది. అయితే కరోనా కు శత్రువులు, మిత్రులు అన్న తేడా లేదు కదా. అవకాశం ఉన్నంతమేరా విస్తరిస్తుంది. అందిన ప్రాణాలను లాగేసుకుంటోంది.

కరోనా మహమ్మారి ఓ రేంజిలో విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ గానీ, పాటించాల్సిన నిబంధనలు గానీ పక్కాగానే అమలు చేయాలన్న అంతిమ నిర్ణయానికి దీదీ రాక తప్పలేదన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ను బెంగాల్ లోనూ పక్కాగానే అమలు చేస్తున్న దీదీ సర్కారు… ఇకపై కేంద్రం ప్రకటించే అన్ని చర్యలను కూడా తూచా తప్పకుండా పాటిస్తామన్నట్లుగా సాగుతోంది. ఇందుకు నిదర్శనంగా లాక్ డౌన్ పై దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ దిశగా దీదీ ఏమన్నారన్న విషయానికి వస్తే… ‘‘ పశ్చిమ బెంగాల్ లో మే నెలాఖరు వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాల్సిందేనని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మే చివరి వరకూ కానీ, జూన్ మొదటి వారాంతం వరకు కానీ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం సూచనల మేరకు కొన్నింటికి మినహాయింపులు కొనసాగుతాయి. రాష్ట్రంలోని గ్రీన్ జోన్లలో తగు జాగ్రత్తలతో షాపులు తెరచుకోవచ్చు’’ అంటూ దీదీ చెప్పుకొచ్చారు.