కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తారంటే..

సాధారణంగా ఏదైనా జబ్బుకు వ్యాక్సిన్ ఇంజక్షన్ల ద్వారా ఇస్తారు. లేదంటే నోటి ద్వారా తీసుకునే మందుగా ఇస్తారు. ఐతే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్‌ను మాత్రం ముక్కు ద్వారా ఇవ్వబోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న కంపెనీలు ఈ విషయంలో ఏ విధానాన్ని పాటించబోతున్నాయో కానీ.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ మాత్రం కరోనా వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా ఇచ్చేలా తయారు చేయబోతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల వెల్లడించారు.

ప్రస్తుతం భారత్ బయోటెక్ టీకా క్లినికల్ ట్రయల్స్ రెండు దశలను పూర్తి చేసుకున్నాయి. మూడో దశ ప్రయోగాలను త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈ లోపు సాధ్యమైనన్ని ఎక్కువ డోస్‌లు తయారు చేసి భారత్‌లో అందించడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.

కాగా కోవిడ్-19తో పాటు ఎబోలా వంటి అంటు వ్యాధులకు టీకాల తయారీ ప్రయోగాలను అడెనోవైరస్‌ల ఆధారంగా నిర్వహిస్తుండగా.. ఇతర పద్ధతులతో పోలిస్తే వీటికి ముక్కు ద్వారా టీకా ఇవ్వడం ఎంతో సులువు, సౌకర్యవంతం అని, సిరంజీలు వాడాల్సిన అవసరం లేదని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే కరోనా వ్యాక్సిన్‌ను భారతీయులందరూ ముక్కు గొట్టాల్లోకి వేసుకునే దృశ్యాలు చూడబోతున్నామన్నమాట.

కరోనా వ్యాక్సిన్ ప్రధానంగా ముక్కు ద్వారానే లోనికి వెళ్తుందన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకుంటే ముక్కు, గొంతు భాగాల్లో ఉండే కణాలు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని సమకూర్చుుకుంటాయని.. తద్వారా వ్యాధి సోకకుండా నిరోధించినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. కాగా తాము వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కృష్ణ ఎల్ల వెల్లడించారు.