అమెరికాలో పై చదువులన్నారు .. వెట్టిచాకిరీ చేయించారు !

వాళ్లు వరసకు బంధువులు అవుతారు. అమెరికాలో పైచదువులు చెప్పిస్తామని ఆశపెట్టారు. బంగారు భవిష్యత్తును కళ్ల ముందు చూయించారు. తీరా అమెరికాకు తీసుకొచ్చాక బంధువుతో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఎలాగోలా వీరి బారి నుండి బయటపడ్డ అతను అమెరికా కోర్టును ఆశ్రయించాడు. ఈ భారతీయ అమెరికన్ జంటకు అమెరికా కోర్టు భారీ షాక్ ఇచ్చింది.

నిందితులైన భార్యాభర్తలకు జైలు శిక్ష విధించడమే కాకుండా బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నిందితుడు హర్మన్ ‌ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్ల జైలు శిక్ష, అతడి భార్య కుల్బీర్ కౌర్‌కు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని నిందితులు తమ బంధువైన అబ్బాయిని పైచదువులు చదివిస్తాం, మంచి భవిష్యత్ చూపిస్తాం అని ఆశపెట్టి అమెరికాకు రప్పించుకున్నారు. ఆ తరువాత అతడి వద్ద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వేధింపులకు పాల్పడుతూ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. వర్జీనియాలో ఉన్న వారి గ్యాస్ స్టేషన్, షాపులో రోజుకు 12 నుండి 17 గంటల చొప్పున పని చేయించుకున్నారు. చివరకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు.

షాపు వెనకభాగంలోని స్టోర్ రూంలోనే ఉండేలా చేశారు. భారత్ కు వెళ్లేందుకు అనుమతించలేదు. వీసా గడువు ముగిసినా అమెరికాలో కొనసాగేలా చేశారు. తన డాక్యుమెంట్లు ఇవ్వమని కోరితే దాడికి దిగడమే కాకుండా సెలవు అడిగితే తుపాకీ చూపిస్తూ చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి క్రూరత్వాన్ని గమనించిన కోర్టు ఇద్దరికీ శిక్షలు విధించడం గమనార్హం.