బీర్ తాగుతూ రోడ్డుపై రచ్చ చేసిన కపుల్ అరెస్ట్

ఆరు నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో శుక్రవారం పలు వాట్సాప్ గ్రూపుల్లో భారీగా షేర్ అయ్యింది. అందులో పొద్దుపొద్దున్నే వాకింగ్ చేసే రహదారి మీద ఒక మహిళ.. ఒక యువకుడు ఇద్దరూ బీర్ బాటిళ్లతో రచ్చ చేయటం.. ఆ దారి వెంట వెళ్లే వాకర్స్ కు ఇబ్బందికరంగా వ్యవహరించిన వైనం పెనుసంచలనంగా మారింది. మద్యం మత్తులో సీనియర్ సిటిజన్లు అని కూడా చూడకుండా రచ్చ చేసిన వారిద్దరిని నాగోలు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ గ్రూపుల్లోనూ పెద్ద చర్చకు తెర తీసిన ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాగా చదువుకున్న వారే అయినప్పటికీ.. సంస్కారం అన్నది లేకుండా.. నిబంధనలకు విరుద్దంగా బహిరంగంగా తాగటం ఒక ఎత్తు అయితే.. అక్కడి వారితో వాదనకు దిగటం.. ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ రచ్చ చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నాగోల్ లోని ఫతుల్లాగూడ ప్రాంతంలో పొద్దుపొద్దునే రోడ్డు మధ్యలో కారు ఆపేసిన ఒక యువకుడు.. యువతి బీర్ తాగుతున్నారు.

ఉదయం వేళ కావటంతో ఆ రోడ్డు మీద వాకింగ్ చేసే సీనియర్ సిటిజన్లు వీరి తీరుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటం సరికాదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికి వినని సదరు మహిళ.. అక్కడి వారితో వాదనలకు దిగారు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయగా.. వారిపై దుర్భాషలాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి వెళ్లిపోయారు.

మద్యం సేవించటం ఒక ఎత్తు.. తమ తీరుతో ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేయటం మరో ఎత్తు.. అక్కడి సీనియర్ సిటిజన్స్ తో రచ్చకు దిగి.. అతి వేగంతో కారును డ్రైవ్ చేసి అందరిని భయపెట్టేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. వీరిద్దరి మీదా నాగోల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి వేళలో వీరిని గుర్తించి.. అరెస్టు చేశారు. మొత్తంగా వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.