వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ ప‌రిస్థితిని ముందుగా అంచ‌నా వేయ‌లేక పోవ‌డంతోపాటు.. ద‌ట్ట‌మైన‌ అట‌వీ మార్గంలో హెలికా ప్ట‌ర్ ప్ర‌యాణించ‌డంతో ఆనాడు.. ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. నాటి వైఎస్ ఘ‌ట‌న‌.. నేటికీ చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా మ‌న పొరుగు దేశం ఇరాన్‌లో చోటు చేసుకుంది. ఇరాన్ అధ్య‌క్షుడు.. ఇబ్ర‌హీం రైసీ త‌న మంత్రివ‌ర్గంలోని కొంద‌రితో క‌లిసి.. అజ‌ర్ బైజాన్‌కు వెళ్లారు. మొత్తం మూడు హెలికాప్ట‌ర్ల‌లో వీరు ప్ర‌యాణించారు.

అయితే.. అనూహ్యంగా వాత‌వ‌ర‌ణంలో చోటు చేసుకున్న మార్పుల‌తో గాలి, వ‌ర్షం కురిసింది. దీంతో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చిక్కుకుని.. ఒక్క‌సారిగా కూలిపోయింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌ లోని జోల్ఫా నగరానికి సమీపంలో ఇబ్రహీం రైసీ ప్ర‌యాణిస్తున్న హెలికాప్టర్ కుప్ప‌లిపోయిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న వెంట ఉన్న మంత్రుల హెలికాప్ట‌ర్లు కూడా.. కూలిపోయాయ‌ని పేర్కొన్నాయి. అధ్యక్షుడు ఇబ్రహీంతో పాటు విదేశాంగశాఖ మంత్రి హోసేన్‌ అమిర్ అబ్దోల్లాహియన్‌, తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్ స‌హా ప‌లువురు అధికారులు ఆయా హెలికాప్ట‌ర్ల‌లో ప్ర‌యాణించారు.

ఊహించ‌ని ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్ట‌ర్‌ ప్రమాదానికి చిక్కుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన‌ వర్షం కురుస్తోందని చెప్పారు. ఇక‌, అధ్య‌క్షుడి హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన విష‌యం తెలిసిన వెంట‌నే.. 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు గాలింపు చర్యలు చేప‌ట్టాయి. అయితే.. ఈ గాలింపు చ‌ర్య‌ల‌కు కూడా పొగ మంచు, వర్షాలతో కూడిన‌ ప్రతికూల వాతావరణం ఇబ్బందిగా మారిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఘ‌ట‌న జ‌రిగి గంట‌లు గ‌డిచినా.. అధ్య‌క్షుడి జాడ తెలియ‌క‌పోవ‌డంతో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఆయ‌న ప్రాణాల‌తో ఉన్నారా? లేరా? అనేది ఉత్కంఠ‌గా మారింది. దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

మోడీ దిగ్భ్రాంతి

ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురి అయిన విష‌యం త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. ఆయ‌న ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఇరాన్ ప్ర‌జ‌ల‌కు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇబ్ర‌హీం క్షేమంగా ఉండాల‌ని.. తిరిగి త‌న‌పాల‌న‌ను కొన‌సాగించాల‌ని భ‌గ‌వంతుడిని వేడుకుంటున్న‌ట్టు మోడీ పేర్కొన్నారు.