రోహిత్ శర్మ.. టాటా బైబై?

ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు. ముంబయికి ఏకంగా ఐదు కప్పులు అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్‌ను చేయడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. ముంబయి ఇండియన్స్ ముంబయిలో ఆడినా, వేరే సిటీలకు వెళ్లినా స్టేడియాల్లో, బయట ఈ విషయమై తీవ్ర నిరసన ఎదుర్కొంది.

కెప్టెన్‌ను మార్చినా సరే.. అది గౌరవప్రదంగా, చెన్నై జట్టులో జరిగినట్లు జరగాల్సిందని.. అలా కాకుండా ఏకపక్షంగా రోహిత్‌ను తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌ను చేసిన తీరు అవమానకరంగా ఉందని రోహిత్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. కెప్టెన్సీ మార్పు జట్టు మీద కూడా తీవ్ర ప్రభావం చూపడం.. ఈ ఐపీఎల్‌లో ముంబయి ప్రదర్శన తేలిపోవడం తెలిసిందే.

కట్ చేస్తే వచ్చే ఏడాది రోహిత్ ఐపీఎల్‌లో ఎక్కడ ఉంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌తోనే ముంబయితో రోహిత్ కాంట్రాక్టు ముగుస్తుంది. వచ్చే ఏఢాది మెగా వేలం జరుగుతుంది. ముంబయి రోహిత్‌ను కొనసాగిస్తుందా.. లేక వదిలేస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముంబయి జట్టులో ఇంత జరిగాక రోహిత్ ఆ జట్టుతో కొనసాగకపోవచ్చని అంటున్నారు. ఇలాంటి టైంలోనే కోల్‌కతా కోచింగ్ సిబ్బందిలో ఒకరైన అభిషేక్ నాయర్‌తో మైదానంలో రోహిత్ జరిపిన పెప్ టాక్ తాలూకు వీడియో ఒకటి బయటికి వచ్చింది.

కెమెరామన్ తన వీడియో తీస్తున్నట్లు గమనించని రోహిత్.. ఓపెన్‌గా కొన్ని కామెంట్స్ చేసేశాడు. “ఒక్కొక్కటిగా అన్నీ మారిపోతున్నాయి. అది వాళ్ల మీద ఆధారపడి ఉంది. నేను ఇవేవీ పట్టించుకోను. ఏదేమైనా కానీ ఇది నా ఇల్లు భాయ్. ఆ దేవాలయాన్ని నేను నిర్మించా. భాయ్ నాదేముంది.. ఇదే చివరిది కదా” అని పేర్కొన్నాడు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే వచ్చే సీజన్‌కు రోహిత్ ముంబయి జట్టును వీడడమో లేదా మొత్తంగా ఐపీఎల్‌కే గుడ్‌బై చెప్పడమో ఖాయంగా కనిపిస్తోంది.