యాపిల్ విషం.. 600 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ టెక్‌ సంస్థ యాపిల్ సంస్థ‌.. విషం చిమ్మింది. ఉద్యోగుల‌ను ఉన్న‌ప‌ళంగా ఉద్యోగాల నుంచి తీసేసి ఇంటికి పంపించేసింది. దీంతో 600 మంది ఉద్యోగులు ఇంటికే ప‌రిమితం అయ్యారు. కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది.

కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ విభాగం ‘కుపెర్టినో’ ఎనిమిది వేర్వేరు రిపోర్టుల ద్వారా విషయాన్ని తెలియజేసింది. వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ ప్రోగ్రామ్‌కు అనుగుణం గా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వివరించింది. ఉద్యోగులను తొలగించే కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీకి తప్పనిసరిగా రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే యాపిల్ త‌న ఉద్యోగుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 371 మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా పలు శాటిలైట్ ఆఫీస్‌లలో డజన్ల సంఖ్యలో ఉద్యోగులు ఇంటిముఖంప‌ట్టారు. అయితే.. సీనియ‌ర్లు, ప‌నిఒత్తిడికి గురికాకుండా ప‌నిచేస్తున్న కొంత మందిని మాత్రం వేరే గ్రూపుల్లో చేర్చి..వారికి వేత‌నాల్లోకోత పెట్టింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో కార్లు, స్మార్ట్‌వాచ్ ప్రాజెక్ట్‌ల నిలిపివేత ప్రక్రియను యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రాజెక్టుల వ్యయాలు, నిర్వహణ సవాళ్లపై ఆందోళనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఒకే సారి 600 మంది ఉద్యోగాలు కోల్పోవ‌డంతో ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌లో బైడెన్ స‌ర్కారుపై ప్ర‌భ‌వం ప‌డుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు.. ఈ 600 మంది ఉద్యోగుల్లో 50 – 100 మంది భార‌త సంత‌తి వ్య‌క్తులు ఉన్నార‌ని స‌మాచారం.