పార్టీల్లో మార్పులు స‌రే.. కేడ‌ర్ క‌లిసివ‌స్తుందా?  బిగ్ డౌట్‌?

 పార్టీకైనా కేడ‌ర్ అత్యంత కీల‌కం. నాయ‌కులు పుట్టుకురావొచ్చు. కానీ, వారు కూడా కేడ‌ర్ నుంచే కొన్ని కొన్ని సంద‌ర్బాల్లో క‌నిపిస్తారు. లేదా వార‌సులు వ‌స్తున్నారు. కానీ, కేడ‌ర్‌ను పుట్టించ‌డం అనేది ఒక్క‌సారి కోల్పోయాక‌.. పార్టీల‌కు చాలా క‌ష్టం. దీనిని పెంచుకునేందుకు నాయకులు ప్ర‌యాస‌లు పడుతున్న విష‌యం తెలిసిందే. అందుకే .. ఇటీవ‌ల కాలంలో అన్ని పార్టీలూ.. కేడ‌రే త‌మ‌కు ప్రాణ‌మ‌ని.. ప్ర‌దాన‌మ‌ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తున్నారు.

కానీ, క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చేస‌రికి.. కేడ‌ర్‌ను ఆట‌లో అరిటిపండులా చూస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. తాజాగా నూజివీడులోని కొన్ని గ్రామాల్లోనూ.. పెన‌మ‌లూరు, త‌ణుకులో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే.. అన్ని రాజ‌కీయాలు కేడ‌ర్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నాయో తెలుస్తుంది. నూజివీడులో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీని  న‌డిపించిన ముద్ద‌ర‌బోయిన‌న‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింది. అయితే.. ఆయ‌న వెంటే న‌డిచిన కేడ‌ర్ ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చే నాయ‌కుడికి స‌హ‌క‌రించేది లేద‌ని తీర్మానాలు చేసింది.

ఇక‌, పెన‌మ‌లూరులో వైసీపీ మార్పు కేడ‌ర్‌నుకుదిపేస్తోంది. న‌యానో.. భ‌యోనో.. బుజ్జ‌గించాల‌ని ఇక్క‌డ నుంచి స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉన్న మంత్రి జోగి ర‌మేష్ శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నా.. కేడ‌ర్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అంతా మీ ఇష్ట‌మేనా.. మీరు చెప్పిన వారి జెండా మోయాలా? అంటూ.. క్షేత్ర‌స్థాయిలో నినాదాలు వినిపిస్తున్నాయి. త‌ణుకులో ఏకంగా.. జ‌న‌సేన‌, టీడీపీల కార్య‌క‌ర్త‌లు త‌న్నుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లోనూ.. కొత్త‌గా వ‌చ్చిన వైసీపీ ఇంచార్జ్‌, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు.. కేడ‌ర్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు కానుక‌లు ఇస్తున్నారు. అయినా.. ఫ‌లితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. `నిన్నటి వ‌ర‌కు ఒక‌రికి జై కొట్టాం. వారికి ఓట్లేయ‌మ‌ని ఇంటింటికీ తిరిగాం. ఇప్పుడు ఇంకొక‌రంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎవ‌రు ఉంటారో.. ఎవ‌రు పోతారో తెలియ‌దు. మాకు వీళ్లు చేస్తున్న‌ది ఏమీ క‌నిపించ‌డం లేదు. మేమెందుకు జెండాలు మోయాలి. ప్ర‌జ‌ల నుంచి అవ‌మానాలు ఎదుర్కొంటున్నాం` అని ఉమ్మ‌డి కృష్ణాలోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో మార్పు ఖాయ‌మ‌ని తెలుస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో కేడ‌ర్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇవి.