అసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సెట్ చేయడంతో ఇద్దరి ఫ్యాన్స్ ఒకరకంగా షాక్ తిన్నారనే చెప్పాలి. ఫహద్ ఫాసిల్, కార్తీ అంటూ తొలుత వేరే పేర్లు వినిపించినా ఫైనల్ గా నందమూరి హీరో లాక్ కావడం కొత్త ట్విస్టు. అసలే కళ్యాణ్ రామ్ ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి దారుణంగా పోయింది. బింబిసార 2 ఇంకా మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో వెంకీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, అది కూడా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడితో అంటే తనకూ సంతోషమే.

ఇదంతా బాగానే ఉంది కానీ నిన్న ఇచ్చిన ప్రకటనలో అనిల్ రావిపూడి ఎక్కడ నిర్మాతల ప్రస్తావన తేలేదు. ముందు నుంచి జరిగిన ప్రచారం ప్రకారమైతే మన శంకరవరప్రసాద్ గారు తీసిన సాహూ గారపాటినే దీనికి మెయిన్ ప్రొడ్యూసర్. కానీ ఆయన్ను కానీ, షైన్ స్క్రీన్ బ్యానర్ ని కానీ ఎక్కడా ట్యాగ్ చేయలేదు. పోనీ ఎఫ్ 2, ఎఫ్ 3 తీసిన దిల్ రాజు పేరు ఉందా అంటే నో. మరి సురేష్ బాబు ఏమైనా ఎంట్రీ ఇస్తారా అంటే అది వెంటనే తేలేలా లేదు. ఎవరు టేకప్ చేసినా, పార్ట్ నర్ షిప్పులు పెట్టుకున్నా ఈ సినిమా క్రేజ్ తగ్గడం ఉండదు. అందులోనూ వెంకీ రావిపూడిల నాలుగో కలయిక కావడంతో హాట్ కేక్ అయిపోతుంది.

ఇది ఫిక్స్ అయితేనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళడానికి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ అయితే అనిల్ ఆల్రెడీ ప్రొడ్యూసర్లను సెట్ చేసుకున్నారని, కాకపోతే అగ్రిమెంట్ల విషయంలో కొంత ఆలస్యం జరగడం వల్ల కాంబో గురించి లీకులు బయటికి వెళ్లకుండా తనే స్వయంగా ట్వీట్ చేసినట్టు చెబుతున్నారు. ఆదర్శ కుటుంబం షూటింగ్ అయ్యాకే ఇది మొదలవుతుంది కాబట్టి రావిపూడికి తగినంత సమయం ఉంటుంది. ఈలోగా రావిపూడి ఆలోగా మిగిలిన వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. సంగీతం భీమ్స్, హీరోయిన్ గా కీర్తి సురేష్ దాదాపుగా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.