పరువు పోయింది.. అయినా అదే వరస

ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఒక ఎక్స్‌ట్రా ప్లేయర్‌ను మైదానంలో క్యాజువల్‌గా మందలించడం అతడి కెప్టెన్సీకే ఎసరు తేవడం.. తనతో ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) పెద్దలు అవమానకరంగా వ్యవహరించిన తీరుపై అతను పెట్టిన పోస్టు నేషనల్ లెవెల్లో దుమారం రేపింది. మైదానంలో సరిగా ఫీల్డింగ్ చేయకపోతేనో, ఇంకేదో తప్పు చేస్తేనో అప్పుడున్న ఆవేశంలో ఒక మాట అనడం మామూలే.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి టాప్ ఇండియన్ టీం క్రికెటర్లు కూడా బూతులు వాడేస్తుంటారు. ఇలాగే విహారి ఏదో ఒక మాట అన్నట్లు తెలుస్తోంది. ఇది చాలా క్యాజువల్ విషయం అంటూ జట్టు సహచరులందరూ అంటున్నారు. కానీ సదరు ఆటగాడు మాత్రం వైసీపీ కార్పొరేటర్ అయిన తన తండ్రికి విషయం చెప్పడం.. అతను ఏసీఏ పెద్దలతో మాట్లాడి విహారి కెప్టెన్సీ ఊడబీకించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయమై విహారి పెట్టిన పోస్టు నిన్నట్నుంచి వైరల్ అవుతోంది. భారత్‌కు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాడికి జరిగిన అన్యాయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై జాతీయ స్థాయిలో ఆంధ్రా క్రికెట్ పరువు పోతోంది. ఐతే ఈ పరిణామాల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఏసీఏ.. రివర్సులో బాధితుడైన విహారి మీద విచారణకు సిద్ధమవుతుండడం అనూహ్యం. విహారి మీద చాలామంది ఫిర్యాదు చేశారని.. దాని మీద తాము విచారణ చేపడుతున్నామని.. తదుపరి చర్యలపై తర్వాత సమాచారం ఇస్తామని ఏసీఏ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

ఇండియన్ టీంకు పరిగణనలో ఉండడం వల్ల విహారిను కెప్టెన్‌గా కొనసాగించొద్దని సెలక్టర్లు చెప్పడం వల్లే తాము అతణ్ని తప్పించినట్లు విడ్డూరమైన కారణం కూడా చెబుతోంది ఏసీఏ. ఆంధ్రా క్రికెట్ సంఘం పెద్దలందరూ వైసీపీకి చెందిన వాళ్లే. ఏపీలో రాజకీయంగా వైసీపీ తీరు ఎలా ఉంటుందో.. క్రికెట్ వ్యవహారాల్లో కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ మరింత అన్‌పాపులర్ అవుతోందంటూ ఏసీఏ మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.