డ్రైవర్లు దిగారు.. రైలు వెళ్లిపోయింది

పంజాబ్‌లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవరు లేని ఒక గూడ్స్ రైలు వంద కిలోమీటర్ల వేగాన్నందుకుని పట్టాల మీద దూసుకెళ్లగా అదృష్టవశాత్తూ ఆ మార్గంలో ప్రయాణికులున్న ఏ రైలూ రాకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అతి కష్టం మీద ఆ రైలుకు అడ్డుకట్ట వేసిన రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంచలనం రేపిన ఈ ఉదంతం గురించి తెలుసుకుందాం పదండి.

జమ్ము కశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లలో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడ్‌తో ఓ గూడ్స్ రైలు పంజాబ్‌కు బయల్దేరాల్సి ఉంది. ఐతే కథువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపిన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్.. హ్యాండ్ బ్రేక్ వేయకుండా బయటికి వెళ్లారు. మామూలుగా అయితే రైలు దానికదే ముందుకు కదలదు. కానీ పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండడంతో రైలు ముందుకు కదిలింది. ముందుకు సాగేకొద్దీ వేగం పెరిగిపోయింది. ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్నందుకుని రైలు ముందుకు దూసుకెళ్లింది. మధ్య మధ్యలో స్టేషన్ల వద్ద రైలు శరవేగంగా దూసుకెళ్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. 

ఐతే కథువా నుంచి రైలు ముందుకు వెళ్లిపోయిన విషయాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించిన లోకో పైలట్ తర్వాతి స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఆ మార్గంలో అదృష్టం కొద్దీ ఏ రైలు ప్రయాణించడం లేదు. రైలు 100 కిలోమీటర్ల వేగంతో 84 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషణ్ వద్ద చెక్కదిమ్మెలు అడ్డుపెట్టి రైలును ఆపాల్సి వచ్చింది. ఆఖరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాలు చాలా వరకు ఇలాంటి మానవ తప్పిదాలతోనే జరుగుతుంటాయి. ఆ రైలు మార్గంలో ఏదైనా ప్రయాణికుల రైలు ప్రయాణించి ఉంటే జరిగే నష్టం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.