ఆర్కే బాట‌లో న‌డిచేది వీరేనా?

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే(ఇటీవ‌ల రాజీనామా చేశారు) ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే బాట‌లో మ‌రికొంద‌రు న‌డిచేందుకు రెడీగా ఉన్నారా?  వైఎస్‌ను అభిమానించేవారు.. ఆర్కేను అనుస‌రిస్తారా?  ఈ క్ర‌మంలో తొలి అడుగు ఆర్కేతోనే మొద‌లైందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం వైఎస్ వ‌ర్గంగా ఉన్న చాలా మంది సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. వీరంతా ఒక‌ర‌కంగా చెప్పాలం టే వైసీపీలో ఉన్నారు. బొత్స‌, ధ‌ర్మాన వంటి కొంద‌రికి మాత్ర‌మే ప‌ద‌వీ భాగ్యం ప‌ట్టింది.

కానీ, ఇంత‌కు రెండింత‌లుగా ఉన్న అనేక మంది తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్‌తో నడిచి.. ఆయ‌న మంత్రి వ‌ర్గంలోచోటు ద‌క్కించుకున్న ఉమ్మ‌డి గుంటూరుకు చెందిన గాదె వెంక‌ట‌రెడ్డి, ఆయ‌న కుమారుడు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. కానీ, వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద నేది వాస్త‌వం. ఇది వైసీపీ త‌ప్పు కూడా కాదు. సంఖ్యాబ‌ల‌మే కార‌ణం. లెక్క‌కు మిక్కిలిగా ఉండ‌డంతో ఇలాంటివారిని ప‌క్క‌న పెట్టారు.

ఇక‌, కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన సీనియర్‌ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరు ఆ పార్టీలో పొసగలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారంతా.. ఆర్కే బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంటే.. రేపు కాంగ్రెస్‌లోకి ష‌ర్మిల వ‌స్తే.. పాత కాపులు, వైఎస్ అభిమానులుగా ఉన్న‌వారు.. యాక్టివ్ అయి.. వైసీపీని వీడే అవకాశం ఎక్కువ‌గా ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇది ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వైసీపీపై ప్ర‌భావం చూపిస్తుంద‌నే లెక్క‌లు వేస్తున్నారు.  

“జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వేసుకున్నా.. కాంగ్రెస్‌కు కీల‌క నాయ‌కులు ఉన్నారు. వీరంతా వైఎస్ హ‌యాం లోనే నాయ‌కులుగా గుర్తింపు పొందారు. కార‌ణాలు ఏవైనా.. వీరు అవ‌కాశం కోసం చూస్తున్నారు. కాబ‌ట్టి మ‌ళ్లీ మేం పుంజుకుంటాం. వీరంద‌రికీ రెడ్ కార్పెట్ ప‌రుస్తాం. ఇక్క‌డ మాకు కాంగ్రెస్‌ను నిల‌బెట్టడ‌మే ల‌క్ష్యం“ అని ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రికి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇక‌, ఏలూరి సాంబ‌శివ‌రావు, కావూరి సాంబ‌శివ‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, సుబ్బ‌రాజు వంటి ప్ర‌ముఖుల‌ను కూడా పార్టీ తిరిగి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్న‌ట్టు ఈయ‌న చెప్పారు. ఏదేమైనా.. ఆర్కే తొలి ప్ర‌క‌ట‌న చేశార‌ని.. జ‌ర‌గ‌బోయేదిఇదేన‌ని ఆయ‌న అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.