ప్రపంచకప్ ఆరంభం.. పరువు తీశారుగా

వన్డే ప్రపంచకప్ అంటే మామూలు టోర్నీ కాదు. క్రికెట్లో అంతకుమించిన ప్రతిష్టాత్మక టోర్నీ ఇంకోటి లేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ టోర్నీకి ఈసారి భారతే ఆతిథ్యమిచ్చింది. మన దేశంలో ప్రపంచకప్ జరగడం ఇది నాలుగోసారి. కానీ గతంలో వేరే ఆసియా జట్లతో కలిసి ఆతిథ్యాన్ని పంచుకున్న భారత్.. ఈసారి సోలోగా ఆతిథ్యమిచ్చింది. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో ప్రపంచకప్ తొలి రోజు స్టేడియంలో కనిపించిన దృశ్యాలు చూసి అందరూ నివ్వెరపోయారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నగరమైన అహ్మదాబాద్‌లో ఆయన పేరిటే కొనసాగుతున్న స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఆ జట్టు చేతిలోనే ఫైనల్ ఓడిన న్యూజిలాండ్ తలపడ్డాయి. రెండూ పెద్ద జట్లే కావడంతో స్టేడియం జనంతో నిండుగా కళకళాడుతుందని అనుకున్నారంతా.

కానీ స్టేడియంలో మ్యాచ్ మొదలయ్యే సమయానికి పట్టుమని పది వేల మంది కూడా లేరు. స్టేడియం సామర్థ్యం లక్షా 20 వేల పైమాటే. అందులో పదో వంతు కూడా స్టేడియంలో లేక ప్రపంచకప్ కళే కనిపించలేదు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ఆటగాడు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టేడియంలో అడుగు పెట్టినా సందడే లేదు. ఇందుకు అందరూ బీసీసీఐ కార్యదర్శి జై షానే నిందిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడైన జై షానే ఇప్పుడు బీసీసీఐలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. అర్హత లేకున్నా, కేవలం అమిత్ షా కొడుకు కావడం వల్ల బీసీసీఐలో చక్రం తిప్పుతున్నాడని అతడిపై ఎన్నో విమర్శలున్నాయి.

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్, భారత్-పాకిస్థాన్ మ్యాచ్, ఇంకా ఫైనల్ ఇలా కీలక మ్యాచ్‌లు అన్నింటికీ మోడీ స్టేడియమే ఆతిథ్యమిచ్చేలా అతనే కీలక పాత్ర పోషించాడు. తీరా చూస్తే తొలి మ్యాచ్‌కు జనం రప్పించలేకపోయాడు. బీజేపీ కార్యకర్తలకు ఉచితంగా టికెట్లు ఇవ్వడమే కాక.. భోజనం టోకెన్లు ఇస్తామన్నా జనం అనుకున్న స్థాయిలో రాలేదు. ఒక ఇన్నింగ్స్ అయ్యాక సాయంత్రానికి ఒక మోస్తరుగా జనం వచ్చారు. వాళ్లు కూడా ఇలా పార్టీ తరఫున వచ్చిన వాళ్లే అని.. మిస్ మేనేజ్మెంట్ వల్ల, ముందు నుంచి టికెట్ల అమ్మకాలు చేపట్టకపోవడం, అభిమానులను ఎంకరేజ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని.. క్రికెట్ మైకంతో ఊగిపోయే దేశంలో ప్రపంచకప్ జరుగుతుంటే తొలి మ్యాచ్‌కు స్టేడియం ఖాళీగా కనిపించిందంటే క్రికెట్ ప్రపంచం ముందు భారత్ పరువు పోయినట్లయిందని జై షా మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.