ఆమె గురించి తెలిస్తే.. సలాం చేయకుండా ఉండలేరు

ఆమెది చాలా సాదాసీదా జీవితం. కానీ.. ఆమెలోని మానవత్వం.. నలుగురికి సాయం చేయాలన్న తపన.. కరోనా లాంటి సంక్షోభ సమయంలో తన గురించి కాకుండా.. అందరి గురించి ఆలోచించే ఆమె తత్త్వం ఎందరికో స్ఫూర్తినిస్తుందని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో తాజాగా వెలుగు చూసిన ఒక స్ఫూర్తి కిరణంగా రత్నమాలను చెప్పాలి. నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. కరోనాలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వీలైనంత మేర సాయం చేయాలన్న తలంపు ఆ ల్యాబ్ టెక్నిషియన్ సొంతం.

నగరం నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేసే ఆమెను విధుల్లోకి రావటం రిస్కుగా అభివర్ణించే వారు చాలామందే ఉంటారు. కానీ.. ఆమె మాత్రం అస్సలు పట్టించుకోరు. ప్రస్తుతం ఎనిమిదినెలల గర్భవతి అయినప్పటికీ.. కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు వెనుకాడరు. ఆమె చేసే పనిని సాహసంగా పోలిస్తే.. అస్సలు ఒప్పుకోరు. నలుగురికి సాయం చేసే అవకాశం వచ్చినప్పుడు మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటన్నది ఆమె మాట.

ముషీరాబాద్ ఆరోగ్య కేంద్రంలో గత నెల నుంచి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆమె గర్భవతి కావటంతో ప్రమాదకరమైన బాధ్యతల్ని అప్పగించేందుకు అధికారులు ఇష్టపడకున్నా.. ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా విధులు నిర్వర్తించటం విశేషం. మార్చి నుంచి మే వరకు గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేశారు.

అనంతరం ఆమె గర్భవతి అన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఆమెను ముషీరాబాద్ కు బదిలీ చేశారు. అయినప్పటికీ.. విధి నిర్వహణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అవకాశం ఉన్నంత వరకు తాను విధులకు హాజరవుతానని చెప్పే రత్నమాలను ఎంత అభినందించినా తక్కువేనని చెప్పక తప్పదు.