దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరో తెలుసా?

జులై వచ్చిందంటే ఇన్ కం ట్యాక్స్ మంత్. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ ను దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. నిన్నటితో (సోమవారం) తో ముగిసిన ఈ గడువు ముచ్చట ఇలా ఉంటే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరు? అన్నది క్వశ్చన్ గా మారింది.

అత్యధిక ఆదాయపన్ను అన్నంతనే దేశీయంగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. తర్వాతి స్థానంలో ఉండే గౌతమ్ అదానీనో.. లేదంటే భారీ ఆదాయం ఉంటే రతన్ టాటా లాంటి వారు ఉంటారని భావిస్తారు. కానీ.. అలాంటి అంచనాలు తప్పు. గడిచిన ఏడాదికి సంబంధించి దేశంలోనే అత్యధిక ఆదాయపన్ను కట్టిన ప్రముఖుడు ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.

ఐటీ శాఖ అందించిన డేటా ప్రకారం అక్షయ్ కుమార్ గత ఏడాది 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా రూ.29.5 కోట్ల ఆదాయ పన్నును చెల్లించారు. దీంతో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఆయన నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన తన ఆదాయాన్ని రూ.486 కోట్లుగా ప్రకటించారు.

బాలీవుడ్ లో భారీ పారితోషికంతో పాటు.. ఏడాదిలో ఎక్కువగా సినిమాలు చేయటం.. వాణిజ్య ప్రకటనల్లో నటించటం ద్వారా అక్షయ్ భారీగా సంపాదిస్తుంటారు. దీనికి తోడు.. తన సంపాదనను ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించటంలోనూ ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక.. అంబానీ.. అదానీల కంటే అక్షయ్ ఎక్కువగా ఆదాయపన్ను కట్టటానికి కారణం వారి ఆస్తులు కంపెనీల పేరుతో ఉండటంతో వారి కంటే అక్షయ్ ఎక్కువ పన్ను కట్టే పరిస్థితి. ఇదే.. ఆయన్ను అత్యధికంగా ఆదాయపన్ను చెల్లింపుదారుగా నిలిపింది.