టీవీ ప్రసారాలకు షాక్ తప్పదా ?

రియాల్టీషోలు, ఓటీటీల పేరుతో విచ్చలవిడిగా హింస, బూతులు, శృంగారం నట్టింట్లోకి వచ్చేసింది. టీవీలు పెడితే చాలు ఏదో ఒక రియాల్టీషో, ఓటీటీల్లో వెబ్ సీరీసులు, సినిమాల పేరుతో బూతులు, సెక్స్ సీన్లు ప్రసారాలైపోతున్నాయి. వీటన్నింటినీ చూడలేరు అలాగని టీవీలను మూసుకుని కూర్చోలేరు. ఇంటిల్లిపాది రియాల్టీషోలు, ఓటీటీల్లో సినిమాలు చూడాలంటేనే ఇబ్బందిగా తయారైంది. అలాంటి ఇబ్బందులకు హైకోర్టు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీషోలకు, ఓటీటీలో వచ్చే వెబ్ సీరీసులు, సినిమాలకు కూడా కచ్చితంగా సెన్సార్ ఉండాల్సిందే అని చెప్పింది.

సినిమాలకు సెన్సార్ ఉన్నట్లే టీవీల్లో ప్రసారాలకు కూడా సెన్సార్ ఉండి తీర్మాల్సిందే అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకనే ముందుగా బిగ్ బాస్ పేరుతో ప్రసారమయ్యే రియాల్టీషో ప్రజెంటర్ నాగార్జునకు నోటీసులు జారీచేసింది. అలాగే కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు  జారీచేసింది. రియాల్టీషో పేరుతో ప్రసారాలయ్యే అసభ్యకర షోలు, స్వేచ్చ పేరుతో ప్రసారాలు అవుతున్న వెబ్ సీరీసులు, సినిమాల్లోని విచ్చలవిడి తనానికి ఎక్కడో ఒక చోట బ్రేకులు పడాల్సిందే అని హైకోర్టు అభిప్రాయపడింది.

నిజానికి విదేశాలకు చెందిన వెబ్ సీరీసులు, సినిమాల కన్నా మనదేశంలో తయారవుతున్న వెబ్ సీరీసులు, సినిమాల్లోనే అడల్ట్ కంటెంట్ మరీ దారుణంగా ఉంటోంది. నాలుగుగోడల మధ్య గుట్టుగా జరిగిపోవాల్సిన ఘటనలన్నింటినీ రియాల్టీషోలని, వెబ్ సీరీసులని వాటి రూపకర్తలు నట్టింట్లోకి తెచ్చేస్తున్నారు.  వీటివల్లే యువతంతా పెడదార్లు పడుతున్నారని, నైతిక విలువలు పతనమవుతున్నాయని అనేందుకు లేదు.

అయితే నైతికవిలువల పతనానికి ఇవి బాగా దోహదపడుతున్నాయని మాత్రం చెప్పచ్చు. కొన్ని సీరీసుల్లో అయితే విచ్చలవిడి శృంగారాన్ని ఉంటోంది. స్మార్ట్ మొబైల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, ఇంటర్నెట్ సౌకర్యం చాలా చవకైపోవటంతో ప్రతి ఒకళ్ళు అసభ్యాలను చూసేస్తున్నారు. సినిమాలకు సెన్సార్ ఉన్నట్లే టీవీ ప్రసారాలకు ఎందుకు సెన్సార్ ఉండటంలేదనే ప్రశ్న చాలాకాలంగా వినబడుతోంది. వాటికి సమాధానంగానే హైకోర్టు ముందడుగు వేసింది. మరి హైకోర్టు నోటీసులకు ప్రభుత్వాలు ఏమి సమాధానాలు ఇస్తాయో చూడాలి.