ఇద్దరు కూతుళ్లకు రెండో భర్తకు పిల్లలు..ఓ తల్లి దారుణం

ఈ కలికాలంలో కామాంధులకు కొదవ లేదు. ఆరేళ్ల పసిపాప నుంచి అరవై ఏళ్ల ముసలావిడ వరకు చాలామంది మహిళలు లైంగిక బాధితులుగా ఉంటున్నారు. కొందరు మృగాళ్లయితే వావివరసలు…రక్తసంబంధాలు అన్నీ మరచి వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతుళ్ల పాలిట కాలయముడిగా, కామాంధుడిగా మారిన ఘటనల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే, తాజాగా ఓ కన్నతల్లి తన పేగుతెంచుకు పుట్టిన కూతుళ్ల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించిన తీరు సంచలనం రేపుతోంది.

పేగు బంధానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి దారుణంగా వ్యవహరించిన తీరు ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో షాకింగ్ గా మారింది. తన ఇద్దరు కూతుళ్లను తన రెండో భర్తకు ఇచ్చి కట్టబెట్టిన కసాయి తల్లి ఉదంతం వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవ్వక మానదు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఓ మహిళకు భర్త, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో, తన మేనత్త కుమారుడిని రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేదంటే వదిలేస్తానని అతడు బెదిరించసాగాడు. అలా కొన్నేళ్లు గడిచినా వారికి పిల్లలు కలగలేదు. ఈ క్రమంలోనే తన మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు యుక్త వయస్సుకు వచ్చారు. దీంతో, తన కూతుళ్లతోనే పిల్లలను కనాలని రెండో భర్తను ఆమె కోరింది.

వావి వరసలు మరిచిన ఆమె భర్త…17 ఏళ్ల పెద్ద కుమార్తెతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, 2017లో ఆ అమ్మాయి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, మగ పిల్లాడు కావాలని అతడు పట్టుబట్టడంతో తన రెండో కుమార్తెనూ భర్తకు ధారాదత్తం చేసింది. 2022లో మగ శిశువు పుట్టి చనిపోయాడు. ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి ఆమె విశాఖపట్నం వెళ్లింది. ఈ సమయంలో గ్రామంలోనే ఉన్న చిన్న కుమార్తె…తన మిత్రుడైన ఓ యువకుడికి విషయం చెప్పింది. చివరకు ఆ విషయం పిల్లల మేనమామకు తెలియడంతో ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు…విచారణ జరుపుతున్నారు.