16 వేల గుండె ఆపరేషన్లు చేసి, గుండె పోటు తో మృతి

ఆయ‌న యువ డాక్ట‌ర్‌. ప‌ట్టుమ‌ని నాలుగు ప‌దుల వ‌య‌సు పూర్తిగా నిండ‌నేలేదు. కానీ, ఆయ‌న ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఎక్క‌డ నుంచి ఎవ‌రు వ‌చ్చినా.. నాడి ప‌ట్టుకుని గుండె చ‌ప్పుడును లెక్క‌గ‌ట్టేవారు. ఈ క్ర‌మంలో కొన్ని వేల గుండెల చ‌ప్పుళ్లు విని.. ఆగిపోతున్న వాటికి ఊపిరి ఇచ్చి.. చ‌ప్పుడు చేసేలా ప్రాణాలు పోశాడు. కానీ… విధి బ‌లీయం. ఇన్ని వేల మంది గుండెల‌ను ఆగ‌కుండా చేసిన ఆయ‌న యువ డాక్ట‌ర్‌.. త‌న గుండె చ‌ప్పును వినలేక‌పోయాడు. అత్యంత పిన్న వ‌య‌సులో ల‌క్ష‌ల మంది అభిమానుల‌ను సంపాయించుకున్న యువ డాక్ట‌ర్ రాత్రికి రాత్రి ఆక‌స్మిక‌ గుండె పోటుతో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం దేశం మొత్తం ఆయ‌నకు క‌న్నీటి నివాళి అర్పిస్తోంది.

ఎవ‌రు? ఏమిటి?

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రాంతానికి గౌర‌వ్ గాంధీ వ‌య‌సు 41(ఇటీవ‌లే పుట్టిన రోజు చేసుకున్నారు). ఈయ‌న అత్యంత పిన్న వ‌య‌సులోనే దేశంలోనే ప్ర‌ఖ్యాతి చెందిన కార్డియాల‌జిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఈయన కోసం దేశ విదేశాల నుంచి హృద్రోగులు క్యూ క‌డ‌తారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. కానీ, ఇది నిజం. ఈయ‌న డెయిరీ.. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు నిండిపోయిందంటే.. ఈయ‌న హ‌స్త‌వాసి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సుమారు 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసి, గుండె జబ్బులపై నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే..విధి విలాసం.. త‌న గుండె చ‌ప్పుడును ఆయ‌న వినిపించుకోలేక పోయారో.. లేక టైం అయిపోయిందో.. రోజూలాగే సోమవారం రాత్రి ఆస్పత్రిలో పని ముగించుకొని ప్యాలెస్‌ రోడ్డులో ఉన్న ఇంటికి ఆయన చేరుకున్నారు. ఇంట్లోవాళ్లతో కలిసి భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించారు. రోజూ ఉదయం ఆరింటికల్లా నిద్ర లేచే డాక్ట‌ర్‌.. మంగళవారం ఉదయం ఆరు దాటినా లేవకపోవడంతో దగ్గరకు వెళ్లి పిలవగా స్పందించలేదు. అచేత‌న స్తితిలో బెడ్‌పై ప‌డి ఉన్నారు.

వెంటనే కుటుంబ స‌భ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి కార‌ణం.. నిద్ర‌లోనే వ‌చ్చిన గుండె పోటు.. పైగా 40 ఏళ్ల ప్రాయంలోనే అది కూడా గుండెల డాక్ట‌ర్‌నే బ‌లితీసుకున్న వైనంతో దేశ‌మే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈయ‌న‌కు ఎలాంటి అలవాట్లూ లేవు. ఆలివ్ ఆయిల్ వాడ‌తార‌ని కుటుంబం చెప్పింది. మ‌రి విధి విలాసం కాక మ‌రేమిటి!!