మార్గ‌ద‌ర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు 793 కోట్ల ఆస్తి అటాచ్‌

ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భారీగా రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసింది. రూ. 793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీగా నగదు, బ్యాంక్‌ ఖాతాల్లో నిధులు, మ్యూచువల్‌ఫండ్‌లో డిపాజిట్లు అటాచ్‌ చేసింది.

కాగా మార్గదర్శి కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌ ఉన్న విషయం తెలిసిందేన‌ని ప్ర‌క‌టన‌లో వివ‌రించింది. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీమ్‌ల నిర్వహణ, సబ్‌స్క్రిప్షన్‌ నిధులు చెల్లించకపోవడం వంటి అక్రమాలను గుర్తించామ‌ని ఏపీ సీఐడీ తెలిపింది. మార్గదర్శి చిట్స్‌ ఖాతాదారుల భద్రత కోసం ఆస్తుల అటాచ్‌ చేస్తున్నట్లు సీఐడీ తెలిపింది.

మార్గదర్శిలో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫోర్‌మెన్‌, ఆడిటర్‌లు కుట్రతో నేరానికి పాల్పడినట్లు పేర్కొంది. మార్గదర్శి చిట్స్‌ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది. ‘వడ్డీలిస్తామని చట్ట విరుద్ధంగా డిపాజిట్లను సేకరించడం, అక్రమంగా నిధులు మళ్లించింది.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్ట ఉల్లంఘనలకు పాల్పడింది.‌ ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచ్‌ల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తోంది. ఏపీలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్‌ గ్రూప్‌లు.. తెలంగాణలో 2,316 చిట్స్‌ గ్రూప్‌లు క్రీయాశీలకంగా ఉన్నాయి. ఖాతాదారులకు వెంటనే డబ్బుఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు. ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మార్గదర్శి మళ్లించింది.’ అని సీఐడీ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.