అంతటి ట్రాక్ రికార్డు ఉన్నా.. ఘోర ప్రమాదం తప్పలేదే?

కోజికోడ్ విమాన దుర్ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. విధి వైచిత్రం కాకుంటే.. అసలీ ప్రమాదం జరగాల్సిందేనా? అన్నది చూస్తే.. నో అనే మాట అనిపించక మానదు. చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ తప్పించలేరన్నట్లుగా ఈ ప్రమాదం కనిపించక మానదు.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. భారీగా వరద నీరు ఒక వీధిలో ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు నిలుచొని ఉంటారు. ఒకరు ముందుకు వెళుతుంటే.. మరొకరు వెనుకగా ఉంటారు. చేతిలో మొబైల్ లో ఏదో చూస్తూ ఉన్న ఆ మహిళను ముందు వ్యక్తి పిలవటం.. సరేనని తను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతుంది. అలా వెళ్లిన రెండు మూడు సెకన్ల వ్యవధిలోనే అప్పటివరకు మామూలుగా ఉన్న ఒక భవనం గోడ కుప్పకూలిపోతుంది.

బతికి ఉండాలని రాసి పెడితే.. ప్రకృతి సైతం సహనంగా వెయిట్ చేస్తుంటుందన్న మాటతో ఆ వీడియో ముగుస్తుంది. తాజాగా కోడికోడ్ దుర్ఘటననను చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఈ విమానాన్ని నడిపిన పైలెట్ బోయింగ్ విమానాల్ని నడపటంలో దిట్ట. అతని ట్రాక్ రికార్డు తిరుగులేనిది. ఎయిర్ ఫోర్సులో రిటైర్ అయిన దీపక్ వసంత్ సాథే.. 2005లో ఎయిరిండియాలో జాయిన్ అయ్యారు.

భారత వైమానిక దళంలో పని చేసిన సమయంలో ఆయన మిగ్ 21లకు పైలట్ గా వ్యవహరించారు. ఎయిర్ ఫోర్సు అకాడమీలో పైలట్ కోర్సును స్వోర్డ్ఆఫ్ ఆనర్ గౌరవంతో పూర్తి చేశారు. 2003లో ఎయిర్ ఫోర్సు నుంచి బయటకు వచ్చారు. అంకితభావం.. అంతకు మించి విమానాల్ని నడపటంలో అపారమైన అనుభవం ఆయన సొంతం. గతంలో రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా సాధించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. అలాంటి ఆయన నడిపిన విమానం ఇంతటి ఘోర ప్రమాదానికి కారణం కావటం చూస్తే.. విధి మహిమ తప్పించి మరేమైనా అనుకోగలమా?