టీడీపీ.. వైసీపీ రెండు పార్టీల్లోనూ సేమ్ ప్రాబ్ల‌మ్‌…!

ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ది ప‌దిహేను మిన‌హా.. మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ, వైసీపీల్లో ఇద్ద‌రికి మించిన నాయ‌కులు పోటీలో ఉన్నారు. మాకంటే మాకే టికెట్ ఇవ్వాల‌ని.. వైసీపీలో అయితే.. రోజు పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త‌వారు ఈ పోటీలో ముందున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. ఒక్కొక్క చోట న‌లుగురు నాయ‌కులు కూడా రెడీగా ఉన్నారు.

అదే స‌మయంలో కొత్తవారు కూడా బేల చూపులు చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ఇస్తామ‌ని చెప్పార‌ని.. కానీ.. ఇప్ప‌టికీ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు అంటున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి వైసీపీని వెంటాడుతోంది. ఉదాహ‌ర‌ణ‌కు బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం కోన ర‌ఘుప‌తి ఉన్నారు.కానీ, ఇక్క‌డ నుంచి గాదె వెంక‌ట రెడ్డికుమారుడు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో అంబ‌టిని పోటీ చేయాల‌ని పార్టీ చెప్పింది.

కానీ, ఇక్క‌డ మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ కుమారుడు ఉన్నారు. తిరుప‌తిలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి మ‌ల్లాది విష్ణు ఉండ‌గా.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు .. ఇప్పుడు చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, క‌మ‌లాపురం టికెట్‌ను సొంత పార్టీ నాయ‌కులే కోరుతుండ‌గా.. ఇక్క‌డ సీఎం జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి త‌న కొడుకును రంగంలోకి దింపాల‌ని చూస్తున్నారు. ఇలా.. వైసీపీ ప‌రిస్థితి ఉంది.

ఇక‌, టీడీపీలోనూ కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో బొండా ఉమా కు పోటీ.. మ‌రో నేత రెడీ అయ్యారు. ఆయ‌న ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్ర‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా క‌ర్నూలులోనూ ఒక‌రికి మించి ఇద్ద‌రు ముగ్గురు నాయ‌కులు నియోజ‌క వ‌ర్గంలో పోటీ ప‌డుతున్నారు. దీంతో ఉన్న‌వారికే అవ‌కాశం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి తోడు కొత్త ముఖాలు మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

మేం పార్టీకోసం క‌ష్ట‌ప‌డ్డాం.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోరా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో వైసీపీ.. టీడీపీల‌లో ఈ వెయిటింగ్ లిస్టులు పెరిగిపోతున్నాయి. ఇక్క‌డ చిత్రం ఏంటంటే .. జ‌న‌సేన క‌నుక ఒంట‌రిగా నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తే.. వీరి ఒత్తిడి ఈ రెండు పార్టీల‌పైనా త‌గ్గి నాయ‌కులు జ‌న‌సేన‌కు క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంటుంది. కానీ, అక్క‌డ అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో ఉన్న‌వారంతా.. ఈ రెండు పార్టీల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు.