పెద్దనోట్లన్నీ బంగారం షాపులకు వెళిపోతున్నాయా ?

పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ఉద్దేశ్యంతో రద్దు చేసిందో తెలీదు. నాలుగు రోజుల క్రితం 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రకటించిన మరుసటి రోజునుండి జనాలు నగల షాపులకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐ ఉద్దేశ్యం ఏమిటంటే రద్దయిన నోట్లను జనాలు బ్యాంకులకు తీసుకొచ్చి డిపాజిట్ చేసుకుంటారు లేదా మార్చుకుంటారని. పెద్దనోట్లు రద్దయిన తర్వాత భూములు, వస్తువులు కొనుగోలుకు పెద్దగా ఉపయోగించరు. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు రద్దయిన నోట్లను తీసుకోవటానికి అంగీకరించరు.

అయితే ఆర్బీఐ ఆలోచనకు విరుద్ధంగా బంగారం షాపుల దగ్గర జనాల క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. ఇంత మంది జనాలు బంగారం షాపుల్లోకి వెళుతున్నారంటే అర్ధమేంటి ? 2 వేల రూపాయల నోట్లతో బంగారం, వజ్రాలు, వెండి ఇలా ఏదో ఒక విలువైన వస్తువులను కొనేస్తున్నారనే కదా. ముంబాయ్, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, సూరత్ తదితర నగరాల్లోని బంగారం వ్యాపారస్తుల దగ్గర గడచిన మూడురోజులుగా వ్యాపారం విపరీతంగా పెరిగిపోయిందని సమాచారం.

కొంతమంది వ్యాపారాస్తులైతే బంగారం కొనుగోలు సమయంలో 2 రెండువేల రూపాయల నోట్లు తీసుకోవాలంటే 5 శాతం అదనంగా ఛార్జ్ చేస్తున్నారట. అదనపు చార్జ్ చేస్తున్నా జనాలు ఆ మొత్తాన్ని చెల్లించేసి నగలు కొనేస్తున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే చాలామంది రు. 2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు బ్యాంకులకు వెళ్ళటం లేదు. తమ దగ్గర ఉన్న డబ్బుతో నేరుగా నగల షాపులకు వెళిపోతున్నారు.

తాము దాచుకున్న లేదా దగ్గరున్న 2 వేల రూపాయల నోట్లతో పెద్ద ఎత్తున నగలు కొనేస్తున్నారట. కొంతమంది పెద్ద ఫర్నీచర్ షాపుల యాజమాన్యాలు కూడా 2 వేల నోట్లను తీసుకుంటామని ప్రకటించటంతో ఇంకొంతమంది విలువైన ఫర్నీచర్ ను కొనేస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ లెక్కల ప్రకారం జనాల నుండి రు. 3.6 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీకల్లా బ్యాంకులకు వచ్చేయాలి. కానీ పరిస్ధితి చూస్తుంటే అలా వచ్చేట్లు కనబడటంలేదు. అంటే గడువు తర్వత కూడా బ్యాంకులకు రాని డబ్బును బ్లాక్ మనీగా పరిగణిస్తారు. అందుకనే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నగల షాపుల మీద కన్నేసుంచారట. మరి చివరకు ఎంత డబ్బు బ్యాంకులకు వస్తుందో చూడాల్సిందే.