మురికి కాల్వ‌లో నోట్ల క‌ట్ట‌లు .. ఎగ‌బ‌డ్డ జ‌నం

ఇటీవ‌ల కాలంలో నోట్ల క‌ట్ట‌లు.. రోడ్ల మీద విసిరేస్తున్న ఘ‌ట‌నలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాటిని ఏరుకునేవారు .. పెద్ద ఎత్తున గుమిగూడి వాటిని ఏరి సొంతం చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు కూడా త‌ర‌చుగా వార్త‌లుగా వ‌స్తున్నాయి. ఇలానే ఇప్పుడు ఏకంగా కొన్ని నోట్ల క‌ట్ట‌లు ఏకంగా మురికి కాల్వ‌లో క‌నిపించ‌డం..వాటిని ఏరుకునేందుకు స్థానికులు ఆ డ్రైనేజీలో దిగి ఏరుకోవడం వంటివి దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిగా మారాయి. ఐటీకి భ‌య‌ప‌డో.. లేదా .. ఎవ‌రికీ దొర‌క‌కూడ‌ద‌నో.. కొంద‌రు అక్ర‌మ సంపాద‌న ప‌రులు ఇలా.. తమ వ‌ద్ద ఉన్న ధ‌నాన్ని రోడ్ల‌మీద‌కో.. కాల్వ‌ల్లోకో విసిరేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఘ‌ట‌న ఎక్క‌డంటే..

బిహార్ రోహ్తాస్ జిల్లా సాసారం ప్రాంతంలోని ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు ప‌డేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో స్థానికులందరు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ నోట్ల కట్టల కోసం కాలువ వద్దకు చేరి వెతకడం ప్రారంభించారు. సాసారంలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అయినా డ్రైనేజీలోకి అప్ప‌టికే చేరి డ‌బ్బులు ఏరుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న స్థానికుల‌ను పోలీసులు ఏమీ చేయలేకపోయారు. పోలీసులు మాత్రం ఇదంతా పుకార్లు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం.. తమకు నోట్ల కట్టలు దొరికాయని చెబుతున్నారు. శనివారం ఉదయం తాము కాలువలో నోట్లు తేలడాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. దీంతో అందులోకి దిగి డబ్బులు కోసం వెతుకామని పేర్కొన్నారు.

కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే సమాచారం.. కొంత సమయంలోనే ఊరంతా పాకిందని వారు వెల్లడించారు. దీంతో చాలా మంది కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారని తెలిపారు. అయితే.. పోలీసులు ఈ నోట్ల క‌ట్ట‌ల విష‌యంపై ప్ర‌త్యేకంగా దృష్టిప ఎట్టారు. ఎవ‌రివి..? ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌నే స‌మాచారాన్ని కూపీ లాగుతున్నారు.