ఆ రోజు స్టంప్స్ విరిగాయ్.. కానీ ఈ రోజు

పది రోజుల క్రితం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ముంబయికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్. ఛేదనలో ధాటిగా ఆడిన ముంబయి విజయానికి చేరువగా వచ్చింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి రాగా.. బంతి అందుకున్న పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో ముంబయికి చెక్ పెట్టాడు. ఆ ఓవర్లో కేవలం రెండే పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను గెలిపించాడు.

అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. అతడి ధాటికి రెండుసార్లు స్టంప్ విరిగిపోయింది. వరుస బంతుల్లో అర్ష్‌దీప్.. తిలక్ వర్మ, నేహాల్ వధేరాలను బౌల్డ్ చేయగా.. రెండుసార్లూ మిడిల్ స్టంప్ విరిగింది. అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన

ఈ స్టంప్స్ విలువ రూ.30 లక్షలు కావడం విశేషం. అంత ఖరీదైన స్టంప్‌ను రెండుసార్లు విరగ్గొట్టి బీసీసీఐకి నష్టం తెచ్చాడంటూ అర్ష్‌దీప్‌పై సోషల్ మీడియాలో బోలెడు మీమ్స్, జోక్స్ వచ్చాయి. అప్పుడు బంతితో అంతగా రెచ్చిపోయిన అర్ష్‌దీప్.. బుధవారం రాత్రి మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.

ఇదే ముంబయి జట్టుతో రెండోసారి తలపడ్డ పంజాబ్.. ఈసారి 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ ఈసారి ముంబయి తడబడలేదు. అంత పెద్ద లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గత మ్యాచ్‌లో ముంబయి పతనాన్ని శాసించిన అర్ష్‌దీప్.. ఈసారి బాధితుడిగా మారాడు. 3.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే పడగొట్టి ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఒక బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులు 70. అర్ష్‌దీప్ ఓవర్ ఐదో బంతికే ముంబయి విజయం పూర్తయింది కానీ.. చివరి బంతి కూడా పడి ఉంటే ఆ రికార్డు బద్దలయ్యేదేమో. పది రోజుల్లో ఒక బౌలర్ జాతకం ఎలా తిరిగిపోయిందో అని ఇప్పుడు అర్ష్‌దీప్ మీద మళ్లీ మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు.