ధోని చెప్పకనే చెప్పేశాడు

క్రికెటర్లకు 40 ఏళ్లు వచ్చాయంటే ఆటలో కొనసాగడం చాలా కష్టం. ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు చాలా తక్కువ మంది. టీ20 లీగ్‌ల్లో సైతం 40 మార్కు దాటాక కొనసాగడం కష్టమే అవుతుంది. ఎంతటి మహామహులైన ఆటగాళ్లయినా సరే.. ఆ వయసు వచ్చేసరికి ఫిట్‌నెస్, ఫామ్ సమస్యలు ఎదుర్కొంటారు. కొందరు తమ పని అయిపోయిందని గుర్తించి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. ఇంకొందరు అవకాశాలు ఆగిపోవడంతో ఇక తప్పక రిటైర్మెంట్ తీసుకుంటారు.

ఐతే మహేంద్ర సింగ్ ధోని మాత్రం 42వ పడికి చేరువ అవుతూ కూడా ఇంకా ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. నాలుగేళ్ల ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోని.. ఐపీఎల్‌లో కూడా ఒకట్రెండు సీజన్లకు మించి కొనసాగడని అనుకున్నారు. కానీ ఇంకా అతను ఐపీఎల్‌లో ఉన్నాడు. అతడి ఆట మీద ఎవరికీ ఫిర్యాదుల్లేవు. ఇక క్రేజ్ సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. ధోని కనిపిస్తే చాలు స్టేడియాలు హోరెత్తిపోతున్నాయి.

చెన్నై యాజమాన్యం అయితే.. ధోని బ్యాటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కీపింగ్ చేస్తూ తన కెప్టెన్సీతో జట్టును నడిపిస్తే చాలు ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగిస్తాం అన్నట్లు ఉంది. కానీ ధోని మాత్రం ఈ సీజన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పేయబోతున్నట్లే కనిపిస్తోంది. ఈ సీజన్లో ధోని బ్యాటింగ్ చేసింది తక్కువ సందర్భాల్లో, అది కూడా తక్కువ బంతులే ఎదుర్కొన్నాడు. కానీ ఉన్నంతలో బాగానే ఆడాడు. ఇక వికెట్ కీపింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. కుర్రాళ్లు కూడా అసూయ చెందే చురుకుదనం చూపిస్తున్నాడు.

చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులు ధోనీని చూడటానికే స్టేడియాలకు పోటెత్తుతున్నారు. ఆదివారం కోల్‌కతాతో చెన్నై మ్యాచ్‌కు కూడా స్టేడియం నిండిపోయింది. ధోనీ నామస్మరణతో ఈడెన్ గార్డెన్స్ హోరెత్తిపోయింది. ఐతే మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. అభిమానుల స్పందన గురించి మాట్లాడుతూ.. వాళ్లు తనకు వీడ్కోలు పలకడానికి వచ్చారు అనడం చర్చనీయాంశం అయింది. ఇది అభిమానులకు పెద్ద షాకే. తాను ఈ సీజన్ తర్వాత రిటైర్ కాబోతున్నట్లు ధోని చెప్పకనే చెప్పేశాడని భావిస్తున్నారు.