చైనాను దాటేశాం.. ప్రపంచంలోనే తొలి స్థానానికి భారత్

ఏదైనా విభాగంలో మొదటి స్థానంలో నిలిస్తే ఆ అనందమే వేరు. కానీ.. ఇప్పుడు వెల్లడైన విషయం గురించి వింటే ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ అవుతుంది. అవును.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఇంతకాలం ఈ స్థానంలో చైనా నిలిస్తే.. ఇప్పుడు భారత్ వచ్చేసింది. చైనాకు మించి భారత్ లో 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నారన్న విషయాన్ని తాజాగా లెక్కించారు. భారత జనాభా 142.86 కోట్లుగా ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ఇదే సమయంలో చైనాలో జనాభా 142.57 కోట్లుగా లెక్కించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ జనాభా ఎంతన్న విషయాన్ని ఐక్యరాజ్యసమితి 1950నుంచి వెల్లడించటం మొదలు పెట్టింది. అలా లెక్కించటం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారి ప్రథమ స్థానానికి చేరుకున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ‘‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు 2023’’ పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ సిద్ధం చేసిన రిపోర్టులో భారత్ లో అత్యధిక జనాభా ఉన్నట్లుగా లెక్క కట్టింది. రెండోస్థానంలో చైనా నిలిస్తే.. మూడో స్థానంలో అమెరికా నిలిచింది. ఆ దేశంలో 34 కోట్ల మంది జనాభా ఉన్నట్లుగా వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా 804.5 కోట్ల జనాభా ఉన్నట్లుగా అంచనా వేయగా.. అందులో మూడో వంతులో ఒక వంతు జనాభా భారత్.. చైనాలో ఉన్నట్లుగా తేలింది. ఈ రెండు దేశాల జనాభానే 285 కోట్లు కావటం గమనార్హం. 2011తో పోలిస్తే ఇప్పుడు చైనాతో పాటు భారత్ లోనూ జనాభా పెరుగుదల శాతం కాస్తంత తగ్గింపు లోకి వస్తోంది. భారత్ లో జనాభా గణన ప్రతి పదేళ్లకు ఒకసారి జరగటం తెలిసిందే.
చివరి జన గణన 2011లోజరగ్గా.. షెడ్యూల్ ప్రకారం 2021లో చేపట్టాల్సి ఉంది. కొవిడ్ కారణంగా అది జరగలేదు. దీంతో.. జనాభా ఎంతన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జనాభా పెరుగుదలను కొందరు ఆందోళన చెందే పరిస్థితి. కానీ.. జీవన ప్రమాణాలు.. వనరుల వినియోగం.. లాంటి అంశాల విషయానికి వస్తే.. విరుద్ధపరిస్థితులు నెలకొని ఉంటాయని చెప్పక తప్పదు. ఏమైనా.. సంతోషించదగ్గ ఎన్నో అంశాల్లో ముందు ఉండే కన్నా వెనక్కి ఉండే భారత్.. జనాభా పెరుగుదల విషయంలో మాత్రం ముందుకు దూసుకెళ్లింది. మరి.. దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.