వందేభారత్ స్పీడు ఒక మోసం !

చెప్పే గొప్పలకు.. చేతలకు మధ్య దూరం ఎంతన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మోడీ సర్కారు గొప్పగా తీసుకొచ్చిన వందేభారత్ రైలును అడిగితే చెప్పేస్తుందంటున్నారు. దేశంలోనే అత్యధిక వేగంతో నడిచే రైలుగా గొప్పలు చెప్పేయటమే కాదు.. ఆ రైలుబండిలో ప్రయాణించాలంటే మస్తు పైసలు వసూలు చేస్తున్న వైనం తెలిసిందే. అదేమంటే.. అప్డేటెడ్ టెక్నాలజీతో అదిరే ఫీచర్లతో అంటూ బడాయి మాటలు చాలానే చెప్పటం చూశాం. అయితే.. ఈ ట్రైన్ కు సంబంధించిన అసలు సంగతులు సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చాయి.

విస్తుగొలిపేలా ఉన్న ఈ వివరాల్లోకి వెళితే.. గంటకు 180కిమీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ట్రాకుల సామర్థ్యం కారణంగా గంటకు 130కిమీ వేగంతోనే నడుపుతున్నట్లుగా వందే భారత్ ను పట్టాల మీదకు తీసుకురావటానికి ముందు నుంచి చెబుతున్నారు. అయితే.. ఈ రైళ్ల వేగం మీద తాజాగా ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగారు. దీనికి రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు పట్టాల మీదకు ఎక్కిన వందే భారత్ రైళ్ల సగటు వేగం 83 కిలోమీటర్లు మాత్రమే ఉందని పేర్కొంది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా గంటకు 95 కి.మీ. వేగంతో వెళుతున్నట్లుగా వెల్లడించారు.

మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే సామాజిక కార్యకర్త ఇటీవల వందే భారత్ రైళ్ల వేగం గురించి వివరాల్ని వెల్లడించాలని కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన రైల్వే శాఖ.. 2021-22 లో వందే భారత్ రైళ్లు సగటున 84.48కిమీ వేగంతో ప్రయాణించగా.. 2022-23లో మాత్రం ఆ వేగం మరింత తగ్గి 81.38కిమీ పరిమితమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 14 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. ముంబయి సీఎస్ టీ-సాయి నగర్ షిర్డీ వందేభారత్ రైలు సగటు వేగం కనిష్ఠంగా గంటలకు 64 కిమీ మాత్రమేనని పేర్కొంది.

2019లో ప్రారంభమైన న్యూఢిల్లీ – వారణాశి వందే భారత్ రైలు సగటు వేగం మాత్రం గరిష్ఠంగా గంటకు 95కిమీ సగటు వేగంతో పరుగులు తీస్తున్నట్లు పేర్కొన్నారు. రాణి కమలాపతి – హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ రైలు సగటు వేగం గంటకు 94 కిమీ ఉందని పేర్కొన్నారు. రాజధాని.. శతాబ్ది రైళ్ల కంటే వందే భారత్ రైళ్ల సగటు వేగం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ మాటలు ఎలా ఉన్నా.. గంటకు 130కీమీ వేగం అని చెప్పి.. గంటకు 90 కిమీ కంటే తక్కువ వేగంతో పరుగులు తీసే వందే భారత్ రైళ్లకు వసూలు చేస్తున్న ఛార్జీలు.. అంత ఎక్కువగా ఎందుకు ఉండాలన్న ప్రశ్న తలెత్తక మానదు. కాదంటారా?