కిమ్ మామూలోడు కాదు… వాటికోసం లాక్ డౌన్

కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ప్రపంచ ప్రజానీకానికి తెలిసి వచ్చింది. అప్పటివరకు తెలీని లాక్ డౌన్ తోపాటు మరెన్నో విషయాలు తెలిశాయి. లాక్ డౌన్ అన్నంతనే వణుకు పుట్టేలా మరింది. ఇదిలా ఉంటే తాజాగా పరమ భీకరనియంత ఏలుబడిలోఉన్న ఉత్తర కొరియాలోని ఒక నగరంలోలాక్ డౌన్ విధించారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకూ లాక్ డౌన్ ఎందుకు? మళ్లీ ఆ దేశంలో కొవిడ్ విరుచుకుపడిందా? అంటే.. అదేమీ లేదంటున్నారు.
మరి.. ఎందుకు లాక్ డౌన్ విధించారా? అంటూ ఆరా తీస్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పిస్టల్ లో వాడే తూటాల కారణంగా ఆ నగరంలో లాక్ డౌన్ విధించినట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియాలోని హైసన్ అనే నగరంలో సైనికులు కొన్ని తూటాల్ని పోగొట్టుకున్నారు.

వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వీలుగా లాక్ డౌన్ ను విధించినట్లుగా వెల్లడైంది. ఉత్తర కొరియాలోని సరిహద్దునగరాల్లో ఒకటైన హైసన్ నగరంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 మధ్య సైనిక దళాల ఉపసంహరణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సైనికుల వద్ద నుంచి 653 తూటాలు మిస్ అయినట్లుగా గుర్తించారు.

సైనిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని గుర్తించే ప్రయత్నం చేసినా అవి మాత్రం దొరకలేదు. దీంతో.. ఉన్నతాధికారులకు ఈ అంశం గురించి సమాచారం ఇవ్వగా.. తూటాలు దొరికే వరకు హైసన్ నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఇంతటి విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నది మరెవరో కాదు.. ఆ దేశాధ్యక్షుడు కమ్ నియంత అయిన కిమ్ జోంగ్ ఉన్.

అతగాడి నిర్ణయం కారణంగా ఆ నగరంలోని రెండు లక్షల ప్రజల జీవితాలు స్తంభించిపోయాయి. ఇళ్లకే పరిమితమయ్యారు. తూటాలు పడిపోతే.. లక్షలాది మంది బతుకులకు లాక్ డౌన్ విధించిన కిమ్ లాంటి పాలకుడి నీడలో బతుకుతున్న ప్రజల జీవితాలను తలుచుకుంటేనే వణుకు పుట్టటం ఖాయం. కాదంటారా?