ప్రపంచ కుబేరుల్లో భారతీయులు ఎందరు? తెలుగోళ్ల లెక్కేంటి?

తాజాగా ప్రపంచ కుబేరుల జాబితా రావటం తెలిసిందే. హురున్ విడుదల చేసిన ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ముకేశ్ అంబానీ ఒక్కడే ఉండటం తెలిసిందే. అదానీ టాప్ 10 జాబితా నుంచి మాయం కావటం తెలిసిందే.

మరి.. టాప్ 150లో మనోళ్లు ఎందరు? అందులో తెలుగువారి లెక్కేంటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి. అదే సమయంలో.. భారత్ లో కుబేరుల సంఖ్య పెరుగుతున్నా.. మన దేశానికి ముంగిట్లో ఉన్న చైనాతో పోల్చినప్పుడు ఆ సంఖ్య తక్కువన్న సంగతి అర్థమవుతుంది.

మన దేశంలో 187 మంది బిలియనీర్లు ఉన్నట్లుగా హురున్ నివేదిక వెల్లడించింది. ఇక.. ఇందులో కొత్తగా చేరిన వారు 15 మంది అయితే.. బిలియనీర్ల జాబితాలో ఉన్న మహిళల విసయానికి వస్తే.. పది మంది ఉన్నట్లుగా తేలింది. ఈ పది మంది మహిళల్లో టాప్ ఎవరన్న విషయానికి వస్తే.. ఐటీ రంగానికి చెందిన రాధా వెంబు 400 కోట్ల డాలర్ల ఆస్తులతో ఆమె తాజా జాబితాలో రెండో స్థానంలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక.. దివంగత ఇన్వెస్ట్ మెంట్ గురు రాకేశ్ ఝున్ ఝున్ వాలా సతీమణి రేఖ ఈసారి కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకోవటం గమనార్హం.

మన దేశంలోని 187 మంది బిలియనీర్లలో ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అన్న విషయానికి వస్తే.. మొదటి స్థానం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. మొత్తం 187 మందిలో 66 మంది ముంబయిలోనే నివసిస్తున్న విషయం వెల్లడైంది. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 39 మంది.. బెంగళూరులో 21 మంది నివసిస్తున్నట్లుగా తేలింది.
దీంతో.. మొదటి మూడు స్థానాల్లో హైదరాబాద్ లేకపోవటం గమనార్హం.

రంగాల వారీగా చూసినప్పుడు 2700 కోట్ల డాలర్ల సంపదతో ఫుణె కేంద్రంగా పని చేసే సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా హెల్త్ కేర్ లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. మొత్తం కుబేరుల్లో భారత్ వాటా కేవలం 5 శాతంగా ఉంటే.. అమెరికా వాటా 32 శాతం ఉండటం గమనార్హం.
భారత కుబేరుల్లో టాప్ 10లో ఉన్న వారు.. వారి సంపదన.. ప్రపంచ ర్యాంకును చూస్తే..

పేరు ర్యాంకు సంపద(బిలియన్ డాలర్లలో)
ముకేశ్ అంబానీ 09 82
గౌతమ్ అదానీ &ఫ్యామిలీ 23 53
సైరస్ పూనావాలా 46 27
శివ్ నాడార్ & ఫ్యామిలీ 50 26
లక్ష్మ ఎన్ మిత్తల్ 76 20
ఎస్ పీ హిందుజా&ఫ్యామిలీ 76 20
దిలీప్ సంఘ్వి & ఫ్యామిలీ 98 17
రాధాకిషన్ దమానీ &ఫ్యామిలీ 107 16
కుమార్ మంగళం బిర్లా&ఫ్యామిలీ 135 14
ఉదయ్ కోటక్ 135 14