తాజ్ దగ్గర ఫోటోలు దిగొద్దని భార్యకు చెప్పిన ప్రిన్స్, ఎందుకు?

రాజమహల్లో.. రాజరిక కుటుంబాల్లో జరిగే విషయాలు దాదాపుగా బయటకు రావు. ఒకవేళ వచ్చినా అవన్నీ కూడా అలా జరిగిందట.. ఇలా చేశారట.. అలా అయ్యిందట.. లాంటి మాటలే తప్పించి.. రాజరిక వంశీయులు తమకు తాముగా ఓపెన్ కావటం చాలా తక్కువగా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి ఎన్నో రాజరిక కుటుంబాలు ఉన్నప్పటికీ.. బ్రిటిష్ రాజకుంటానికి ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదన్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయి కోసం అంతటి విలువైన రాజరిక హోదాను సైతం సింఫుల్ గా వదిలి పెట్టేసి వెళ్లిపోయిన వారిలో ప్రిన్స్ హ్యారీ నిలుస్తారు.

తాజాగా అతను రాసిన ‘స్పేర్’ అనే పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అందులో పలు ఆసక్తికర అంశాల్ని.. సంచలన విషయాల్ని.. రాజకుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల్ని వివరించటం తెలిసిందే.ఈ పుస్తకం విడుదలకు ముందే అందులోని అంశాలు కొన్ని బయటకు వచ్చి.. పుస్తకం ఎప్పుడు విడుదల అవుతుందా? అన్న ఆసక్తి వ్యక్తమైంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చింది.

ఇందులో భారత్ కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దాదాపు ఐదేళ్ల క్రితం అంటే 2017లో ఒక ఛారటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాలీవుడ్ నటి.. ఇప్పటి ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ (అప్పట్లో ఆయన ప్రియురాలు) భారత్ కు వచ్చారు. భారత పర్యటన తర్వాతే వారిద్దరి పెళ్లి జరిగింది. ఆ పర్యటన సందర్భంగా తాను తాజ్ మహల్ ముందు ఫోటో దిగొద్దని మేఘన్ కు చెప్పినట్లుగా పేర్కొన్నారు.

అద్భుతమైన పాలరాతి కట్టటం ముందు ఫోటో దిగేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ప్రిన్స్ హ్యారీ మాత్రం తన ప్రియురాలిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ముందు ఫోటో దిగొద్దని స్పష్టంగా చెప్పినట్లు తన పుస్తకంలో పేర్కొన్నారు. ఎందుకలా? అన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. తాజ్ మహల్ ముందు తన తల్లి దివంగత ప్రిన్స్ డయానా ఫోటో దిగారు.

ఆ ఫోటో ప్రాచుర్యం పొందటం తెలిసిందే. మేఘన్ కూడా అలానే ఫోటో దిగితే.. ఆమె కూడా తన తల్లిని అనుకరిస్తోందన్న మాట వచ్చే వీలుందని.. అది తనకు ఇష్టం లేని కారణంగా.. తాజ్ ముందు ఫోటో దిగొద్దని తాను మేఘన్ కు చెప్పిన వైనాన్ని తాజా పుస్తకంలో వెల్లడించటం గమనార్హం.