40 నిమిషాలు.. 2 ల‌క్ష‌ల టికెట్లు.. 6 కోట్ల క‌లెక్ష‌న్‌!!

కేవ‌లం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఎంత ఎక్కువ‌గా టికెట్లు అమ్మాల‌న్నా.. ల‌క్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజ‌మౌళి వ‌ర‌కు.. ఎవ‌రి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌పంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. ల‌క్ష‌ల్లో ఇంత త‌క్కువ స‌మ‌యంలో టికెట్లు అమ్మిన ప‌రిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుద‌ల‌య్యాయోలేదో.. వెంట‌నే కేవ‌లం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.

మొత్తంగా ఈ టికెట్ల విక్ర‌యం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయ‌ల‌ను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి క‌నిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్‌లోనే ప్ర‌క‌ట‌న చేసింది.

మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడి ద‌ర్శ‌న భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయింద‌న్న మాట‌.