7 కోట్లు ఆశ చూపి 20 లక్షలు దొబ్బేశారు

రాంగోపాల్ వ‌ర్మ సినిమాలు అంటే.. కొంత స‌స్పెన్స్‌.. అంత‌కు మించిన థ్రిల్ల‌ర్‌.. ఇంకొంత దూకుడు.. అన్నీ క‌లిసి ఉంటాయి. అయితే.. వీటిని మించి రియ‌ల్ జీవితంలో జ‌రిగితే.. ఇంకెలా ఉంటుంది. అచ్చం ఇలాంటి సినిమాకు బాబు లాంటి ఘ‌ట‌న గుంటూరులో జ‌రిగింది. ఇక్క‌డ ఓ అమ్మాయ్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. సినిమా ట్విస్ట్‌ల‌ను మించిపోయింది. దీంతో ఈ విష‌యం క‌నుక వ‌ర్మ‌కు తెలిస్తే.. సినిమా తీసేయ‌డం ఖాయ‌మ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏం జ‌రిగిందంటే..
తండ్రికి తెలియకుండా ఆయన ఖాతా నుంచి రూ.2 లక్షలు వాడుకున్న ఓ యువతి.. ఆ మొత్తం సర్దుబాటు చేయాలని భావించి సైబర్ ముఠా చేతిలో చిక్కింది. చివరకు తన కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.7 కోట్లకు కిడ్నీ కౌంటామని, ముందుగానే మూడున్నర కోట్లు ఇస్తామని ఆ యువతిని నమ్మించిన సైటర్ మాయగాళ్లు ఆమె నుంచి రూ.16.5 లక్షలు కాజేశారు. సినీ ఫక్కీలో అనేక మలుపులు తిరిగిన ఈ కథ ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది.

గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన 17 ఏళ్ల వ‌య‌సున్న‌ అన్నం యామిని ఇంటర్ ఫెయిలైంది. దీంతో ఆ సబ్జెక్టులు పూర్తి చేసేందుకు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. ఆమె తండ్రి రాజమోహన్ రావు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లు కట్టుకునేందుకు ఆయన రూ. 20 లక్షలు పోగు చేసి తన బ్యాంకు ఖాతాలో ఉంచాడు. అయితే, ఈ ఆర్థిక లావాదేవీలన్నీ యామిని నిర్వహిస్తోంది. అయితే, తండ్రి ఇచ్చిన స్వ‌తంత్రంతో ఆమె తన ఖర్చులకుగాను తండ్రి ఖాతా నుంచి ఆమె ఆయనకు తెలియకుండానే రూ.2 లక్షలు వాడేసుకుంది.

ఇక్క‌డే ఫ‌స్ట్ ట్విస్ట్ చోటు చేసుకుంది.. తండ్రికి త‌ను వాడుకున్న 2 ల‌క్ష‌ల విష‌యం తెలిసేలోగానే ఆ మొత్తాన్ని జమ చేయాలని యామిని భావించింది. డబ్బు ఎలా సంపాదించాలా? అని యూట్యూబ్‌లో అన్వేషించింది. ఈ క్రమంలో ఆమెకు ఓ లింకు కనిపించింది. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే వారికి రూ.7 కోట్లు ఇస్తామని సైబర్ ముఠా ఆశ కల్పించింది. ఈ విషయం తెలియని యామిని తాను కిడ్నీ అమ్మేందుకు సిద్ధపడి. ఆ లింకు క్లిక్ చేయగా కొందరు ఆమెతో చాటింగ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమె వారితో చాటింగ్ కొనసాగించింది.

యామినిని నమ్మించేందుకు ముందుగా ఆమె ఖాతాకు వారు రూ.10 వేలు పంపారు. అంతేకాకుండా, యామిని తండ్రి రాజమోహన్ రావు పేరిట చెన్నైలోని సిటీ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఖాతా తెరిచినట్లు నకిలీ పత్రాలు సృష్టించడమే గాక అందులో రూ. మూడున్నర కోట్లు డిపాజిట్ చేసినట్లు కూడా చూపించారు. అయితే, ఆ మొత్తం ‘డ్రా’ చేసుకోవాలంటే వివిధ రకాల పన్నులు చెల్లించాలని చెప్పి యామిని నుంచి విడతల వారీగా నిందితులు రూ.16,40,900 లాగేసుకున్నారు.

వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో యామిని తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని వారిని ప్రాధేయపడింది. అయితే ఢిల్లీకి వస్తే ఆ మొత్తం ఇస్తామ‌ని సైబ‌ర్ ముఠా ఆమెను నమ్మించింది. దీంతో ఆమె ఎలాంటి త‌ట‌ప‌టాయింపులు లేకుండా ఒంటరిగా గత అక్టోబరు 8న ఢిల్లీకి వెళ్లింది. నిందితులు చెప్పిన చిరునామాకు వెళ్లి విచారించగా అక్కడ ఎవరూ ఆమెకు కనిపించలేదు. ఆన్‌లైన్‌లో సంప్రదించినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు తిరిగి ఇంటికి చేరింది.

ఇక్క‌డ ఇంకో ట్విస్టు.. సైబ‌ర్ మోస‌గాళ్ల‌ విషయం తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడిన ఆమె ఎవరికీ చెప్పకుండా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. మరోవైపు, కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన రాజమోహన్ రావు. చివరకు ఆమె కంచికచర్లలో ఉన్నట్లు తెలుసుకుని.. అక్కడకు బయలుదేరాడు. అయితే, తండ్రి వస్తున్న విషయం తెలుసుకున్న యామిని అక్కడి నుంచి అదృశమైంది. దీంతో తండ్రి కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యామినిని వెతికి పట్టుకొచ్చి తండ్రికి అప్పగించారు.

ఈ నేపథ్యంలో యామిని తను మోసపోయిన తీరును తండ్రికి వివరించింది. దీంతో జిల్లా ఎస్పీ అరిఫ్ హఫీజ్ను కలసి విషయం వివరించడంతోపాటు సైబర్ మోసగాళ్లతో సాగించిన చాటింగ్ వివరాలు, వారు పంపిన నకిలీ పత్రాలు, నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను అందించారు. మొత్తానికి ఇన్ని మ‌లుపులు తిరిగిన ఈ ఘ‌ట‌న‌లో ఆమెకు ఆ డ‌బ్బులు వ‌స్తాయో రావో తెలియ‌దు కానీ… నెటిజ‌న్లు మాత్రం తిట్టిపోస్తున్నారు. తండ్రి ఇచ్చిన స్వ‌తంత్రాన్ని ఇలాగేనా వాడుకునేది అని మండి ప‌డుతున్నారు.