న‌ష్టం అనుకుంటే భార్య‌నే వ‌దిలేస్తున్నారు: మ‌స్క్

Elon Musk
Elon Musk

ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ అధినేత‌. ఆయ‌న ఏ నిర్ణయం తీసుకున్నా అయితే, వివాదం లేక‌పోతే.. హాట్ టాపిక్ అవ్వాల్సిందే. మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా ఎప్పటిలాగే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశం అయింది. ట్విట్ట‌ర్‌ను కొనుగోలు చేసిన మస్క్.. వారం రోజుల్లోనే 3700 మంది ఉద్యోగులకు షాకిచ్చాడు. ట్విట్టర్‌లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం సిబ్బందిని తొలగించాడు. దీంతో కొందరు ఉద్యోగులు ఆయన నిర్ణయంపై మండిపడుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మస్క్ ఆస‌క్తిగా స్పందించారు. ఉద్యోగులను తొలగించడానికి గల కారణాన్ని వివరించాడు. అంతేకాదు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు కూడా. న‌ష్టం వ‌స్తుంద‌ని అనుకుంటే, ప‌నికిరాదు అనుకుంటే భార్య‌నే వ‌దిలేస్తున్న రోజులు ఇవి. ఇక‌, ఉద్యోగులు ఎంత‌. అయినా వారికి న‌ష్టం ఏంటి? వారిలో టాలెంట్ ఉన్న‌ప్పుడు ఇది కాక‌పోతే వేరే మార్గం ఎంచుకుంటారు? అని త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇచ్చాడు.

ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తీవ్ర‌ నష్టాల్లో పయనిస్తోంద‌ని మస్క్ అన్నాడు. సంస్థ రోజుకు దాదాపు 4 మిలియన్ డాలర్లను నష్టపోతుందని చెప్పాడు. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే దాదాపు 50% (సుమారు 3,700 మందికి)పైగా ఉద్యోగులను తొలగించినట్టు తెలిపాడు. ఉన్నపళంగా తొలగించినా.. ఆ ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేయలేదని మ‌స్క్‌ వెల్లడించాడు. తొలగించిన ప్రతి ఉద్యోగికీ మూడు నెలల పరిహారాన్ని అందించనున్నట్టు తెలిపాడు. ఇది చట్టబద్ధంగా అందే దానికంటే 50% ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఇదిలావుంటే, ట్విటర్‌ను మస్క్‌ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశాడు. గత వారంలో కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టాడు. తొలుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్ఓ) నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ను తొలగించాడు. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు 4,400 కోట్ల డాలర్ల భారీ డీల్‌ను లాభసాటిగా మార్చుకునేందుకు మస్క్‌ నిర్వహణ వ్యయాలు తగ్గించుకునే చర్యలు ప్రారంభించాడు.