నిత్య పెళ్లికూతురు.. ఆరు పెళ్లిళ్లు..

డబ్బుకు ఆశపడి ఓ యువతి నిత్యపెళ్లికూతురు అవతారం ఎత్తింది.. ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది.. ఏడో వివాహానికీ సిద్ధమైంది.. అంతలోనే అడ్డంగా బుక్కైంది.. తమిళనాడుకు చెందిన ఓ యువతి ఏకంగా ఆరు వివాహాలు చేసుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి పీటలు ఎక్కుతూ ఆరుగురిని పెళ్లాడింది. ఏడో వివాహం చేసుకుంటుండగా.. ఆరో భర్తకు అడ్డంగా దొరికిపోయింది.

త‌మిళ‌నాడులోని నమక్కల్ జిల్లా పరంపథివెల్లూర్ సమీపంలోని కల్లిపాలాయం ప్రాంతానికి చెందిన ధన్పాల్.. వివాహం కోసం వధువును చూడమని బ్రోకర్ బాలమురుగన్కు రూ.1.5 లక్షలు ఇచ్చాడు. బాలమురుగన్ బాగా వెతికి.. మధురై జిల్లాకు చెందిన సంధ్య(26)తో వివాహం కుదిర్చాడు. అన్ని సవ్యంగా జరిగాయి. ఈ నెల మొదట్లోనే వివాహం పూర్తైంది. అయితే, వివాహానికి సంధ్య వైపు బంధువులు కొంతమందే వచ్చారు.

అయినా.. ధన్పాల్కు ఎలాంటి అనుమానం రాలేదు. కొద్దిరోజుల తర్వాత సంధ్య ఒక్కసారిగా మాయమైంది. మొబైల్ నెంబర్కు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. బంధువుల నెంబర్లను సంప్రదించినా నో రెస్పాన్స్. ఇంట్లోని డబ్బులు, నగలు కూడా మాయం. ఇక ధన్పాల్కు తాను మోసపోయానని అర్థమైంది.

వెంటనే పారామతి వెల్లూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ‘సార్.. నేను మోసపోయా’నని కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు, ధన్పాల్ సైతం తనకు తోచిన మార్గాల్లో సంధ్య ఆచూకీ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పారామతి వెల్లూర్కు సమీపంలోని ఓ మహిళ వద్ద సంధ్య ఫొటో కనిపించింది.

ధనలక్ష్మి అనే వివాహ బ్రోకర్ వద్ద ఈ ఫొటో ఉంది. దీంతో ఆమె ద్వారా సంధ్య గురించి ఆరా తీశాడు. తన గురించి తెలియనీయకుండా సంధ్యను సంప్రదించాడు. వరుడిలా పరిచయం చేసుకున్నాడు. సెప్టెంబర్ 22న పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశాడు. ఈ క్ర‌మంలోనే సంధ్య చిక్కింది.

వెంట‌నే పోలీసులకు సమాచారం ఇచ్చి.. వివాహ వేదిక వద్ద ఎదురుచూశాడు ధన్పాల్. సంధ్యతో పాటు ఆమె బంధువులు అయ్యప్పన్, జెయవేల్, బ్రోకర్ ధనలక్ష్మిలు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సంధ్య ఇప్పటికి ఐదుగురిని ఇలా మభ్యపెట్టి వివాహం చేసుకుందని తేలింది.

ఆరో వ్యక్తి ధన్పాల్ అని తెలిసింది. ఆమె వెంట ఉన్న బంధువులు, బ్రోకర్.. అంతా ఈ మ్యారేజ్ స్కామ్లో భాగమని పోలీసులు తేల్చారు. నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరో బ్రోకర్ బాలమురుగన్ కోసం వెతుకుతున్నారు.