బ్రిట‌న్ రాణి ఎలిజబెత్‌-2 క‌న్నుమూత‌

సూర్యుడు అస్త‌మించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రెండో రాణిగా వ్య‌వ‌హ‌రించి.. త‌న‌దైన శైలిలో పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్లిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) (Elizabeth) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భార‌త కాల‌మానం ప్ర‌కారం.. గురువారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం(బ్రిట‌న్ స‌మ‌యం) కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.

సుదీర్ఘకాలంపాటు బ్రిటన్‌ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. రాణి ఎలిజబెత్‌ను గత ఏడాది అక్టోబర్‌ నుంచే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నడవడం, నిలబడడం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పటినుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్‌ క్యాజిల్‌లో ఉంటున్న ఆమె.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

సీనియర్‌ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌ స్కాట్లాండ్‌కు వెళ్లి రాణి ఎలిజబెత్‌ను గురువారం ఉద‌య‌మే కలుసుకున్నారు. రాణి ఎలిజబెత్‌ 2 ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు రావడంపై బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ స్పందించారు. ఎలిజబెత్‌ ఆరోగ్యంపై తనతో పాటు యావత్‌ దేశం ఆందోళన చెందుతోందన్నారు. తనతోపాటు దేశ ప్రజలందరూ ఆమె కోసం ప్రార్థిస్తున్నామని అన్నారు. కానీ, ఇంత‌లోనే ఆమె క‌న్నుమూశారు.