లాక్ డౌన్‌ అన్నారు.. మందుబాబులు రెచ్చిపోయారు

మార్చి నెలలో ఏ సంకేతాలు లేకుండా ఉన్నట్లుండి లాక్ డౌన్ పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒక్క రోజు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ అంటే.. ఆ ఒక్క రోజుకు తగ్గట్లుగా అందరూ అన్ని ఏర్పాట్లూ చేసుకుని ఇళ్లకు పరిమితం అయ్యారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ తర్వాతి రోజు నుంచి లాక్‌డౌన్ అమలు చేసింది.

ఆపై కేంద్ర ప్రభుత్వం వచ్చి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టింది. అక్కడి నుంచి లాక్‌డౌన్‌ను పొడిగించుకుంటూ వెళ్లారు. ఐతే ఈ సంగతి ముందు తెలియక మందు బాబులెవ్వరూ అప్రమత్తం కాలేకపోయారు. ఉన్నట్లుండి మద్యం దుకాణాలు మూత పడటం, దాదాపు రెండు నెలలు అవి తెరుచుకోకపోవడంతో మద్యం ప్రియులు అల్లాడిపోయారు. ఆ తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోగానే ఒక్కసారిగా ఎగబడి మందు కొన్నారు. ఐతే కొన్ని రోజుల తర్వాత పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మద్యం దుకాణాల ముందు క్యూలు కనిపించడం మానేశాయి.

ఐతే హైదరాబాద్‌ సహా కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నట్లు ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడం ఆలస్యం.. మందుబాబులు అప్రమత్తం అయ్యారు. ఒక నెల రోజులకు సరిపడా మద్యం కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. దీంతో ఇటీవల తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. పది రోజుల నుంచి లాక్ డౌన్ ప్రచారం నడుస్తుండగా.. జూన్ 26-30 మధ్య, కేవలం ఐదు రోజుల వ్యవధిలో తెలంగాణలో రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం.

జులై 1 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తే ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు ఉపశమనాన్నిస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడులు బాగా తగ్గిపోయిన సమయంలో మద్యం అమ్మకాలతోనే ఖజానా నిండుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో తెలంగాణకు రూ.1864 కోట్ల రాబడి రాగా.. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది.