ఇదేమి దోపిడీ బాబోయ్.. చాక్లెట్స్ మాయం!

చోరీలు మామూలే. విలువైన వస్తువుల కోసం దొంగతనాలు చేస్తుంటారు. బంగారం.. వెండి.. డబ్బులు.. ఇలా ఖరీదైన వాటి కోసం దొంగతనాలు జరగటం.. వాటికి సంబంధించిన వార్తల్ని నిత్యం చూస్తుంటాం కానీ.. తాజాగా వెలుగు చూసిన దొంగతనం అందరిని ఆకర్షిస్తోంది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ఉదంతం అవాక్కుఅయ్యేలా చేస్తోంది. ఒక చాక్లెట్ల గోదాంను దొంగలు ఊడ్చేసిన వైనం పోలీసులకు సవాలుగా మారింది.

పవర్ ఫుల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తాజాగా ఒక గోదాంలోని చాక్లెట్లను భారీగా దోచేశారు. రాత్రివేళలో జరిగిన ఈ చోరీని.. తెల్లవారుజామున గుర్తించారు. షాకింగ్ అంశం ఏమంటే.. చాక్లెట్ల గోదాంలో లక్షలాది రూపాయిల విలువైన చాక్లెట్లను మాత్రమే కాదు.. వాటితో పాటు.. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని సైతం దొంగలించటం మరింత షాకింగ్ గా మారింది.
లక్నోలోని చిన్హాత్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సింగ్ ప్రముఖ చాక్లెట్ల కంపెనీ అయిన క్యాడ్బరీ బ్రాండ్ కు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు.

ఆయనకు చెందిన గోదాంలో చోరీ జరిగిందని.. రూ.17 లక్షల విలువైన చాక్లెట్లు దొంగలు దోచుకెళ్లినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాం తలుపులు తెరిచి ఉన్నట్లుగా కొందరు రాజేంద్రకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు వెళ్లిన ఆయనకు.. గోదాం మొత్తాన్ని ఊడ్చేసిన సీన్ కు షాక్ తిన్నాడు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని కూడా దోచుకెళ్లిన వైనం చూస్తే.. పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఈ చోరీని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మరింత లోతుగా విచారణను చేపట్టారు. చాక్లెట్ల దొంగల్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.