విమాన టికెట్ల ధరలపై పరిమితి ఎత్తేసిన కేంద్రం

విమాన టికెట్ల ధరలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్ లను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. కాకుంటే.. ఈ నిర్ణయం ఆగస్టు 31 తర్వాత నుంచి అమల్లోకి రానుంది. దీంతో.. ఎయిర్ లైన్స్ లు తమకు తోచిన రీతిలో ధరల్ని నిర్ణయించుకునే వీలుంది. ఇంతకాలం దేశీయ విమాన యానానికి సంబంధించిన టికెట్ల ధరల విషయంలో కనిష్ఠ.. గరిష్ఠ పరిమితిని కేంద్రం నిర్ణయించటం తెలిసిందే. దీనికి తగ్గట్లే విమాన టికెట్ల ధరల్ని అమ్మేవారు.

2020 మే 25 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం దేశీయ విమానయాన టికెట్ల ధరలపై కనిష్ఠ.. గరిష్ఠ ధరలపై పరిమితుల్ని విధించారు. దీని ప్రకారం 40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ దూరం ఉండే ప్రాంతాలకు కనిష్ఠ ధర రూ.2900గా.. గరిష్ఠ ధర రూ.8800లకు మించి వసూలు చేయరాదన్న నిబంధన ఉండేది. దీంతో.. ఆర్థికంగా ఇబ్బందులు పడే వర్గాల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.

దాదాపు 27 నెలల విరామం తర్వాత తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టికెట్ల ధరలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఎత్తి వేయనున్నారు. రోజువారీ డిమాండ్.. విమాన ఇంధన ధరలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న పరిమితిని ఎత్తేస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో.. దేశీయంగా టికెట్ల ధరల్ని విమాన యాన సంస్థలు నిర్ణయించుకునే వీలుంది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో టికెట్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. విమానయాన రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రేట్లు పెరిగే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే.. అలాంటిదేమీ ఉండదు.. తగ్గే అవకాశమే ఉందని చెబుతున్నారు. అయితే.. ఆ వాదనలో నిజం లేదని.. విమాన టికెట్ల ధరలు తగ్గే వీలుందని చెబుతున్నారు. దానికి కారణాల్ని చెప్పుకొస్తున్నారు. అందులో కీలకమైనది గతంతో పోలిస్తే.. ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అక్యుపెన్సీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ధరల్ని పెంచితే ఆ ప్రభావం ఆక్యుపెన్సీ మీద పడుతుంది. అందుకే కేంద్రం అవకాశం ఇచ్చింది కదా అని ధరల్ని పెంచే కన్నా.. జాగ్రత్తలు తీసుకొని డిమాండ్ అధికంగా ఉన్న వేళలో ధరల్ని పెంచుతుందని చెబుతున్నారు.

దీనికి తోడు ముందుగా బుక్ చేసుకునే వారికి సరసమైన ధరల్లో వచ్చేలా జాగ్రత్తలు తీసుకొని.. ప్రయాణానికి కాస్త ముందుగా టికెట్లు బుక్ చేసే వారికి మాత్రం కాస్తంత ధరల్ని భారీగా వసూలు చేసే వీలుందంటున్నారు. ఇంధన ధరలు ఆ మధ్యన భారీగా పెరిగినా.. ఇటీవల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు రిలీఫ్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ధరల్ని పెంచుకొని తిప్పలు పడే కన్నా.. అందుబాటులో ధరల్ని ఉంచి ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవటం ద్వారా లాభాల్ని సాధించే దిశగా విమానయాన సర్వీసులు  ప్లాన్ చేస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు..కేంద్రం పరిమితిని ఎత్తేసిన నేపథ్యంలో ధరల పెంపు ఉంటుందని.. కాకుంటే భారీగా కాదు కానీ ఒక మోస్తరుగా పెంచే వీలుందన్న మాట వినిపిస్తోంది.